Thursday, July 31, 2014

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం
శ్రీకృష్ణభగవానుడు లోకంలో కెల్ల సుందరమూర్తి అని, మహాబల పరాక్రమశాలి అని, రాజనీతి నిపుణుడు అని, తత్త్వవేత్త అని చెప్పవచ్చు. కృష్ణునిపై ఉన్నంత సాహిత్యం ప్రపంచంలో ఏ భాషలోనూ లేదు. శ్రీకృష్ణుడు ప్రపంచానికి ప్రసాదించినది ''భగవద్గీత'' . శ్రీకృష్ణావతార దివ్య లీలామృతం తెలియని వారుండరు. పరమానందాహ్లాదభరిత దివ్య మహాత్యం తెలియని వారు అరుదు. కాని ఆ దివ్య పురుషుని పూర్వోత్తరాల వంశావళి గురించి చాలా మందికి తెలియదు. ఇతని భవ్య వంశ చరిత్ర గురించిన ప్రశంస, ప్రస్తావన భాగవత, భారత, హరివంశ, ఉత్తర హరివంశ, విష్ణుపురాణాది గ్రంథాలలోను వ్రతకాల్పదులలోను, దేవీ భాగవతం లోను కనబడుతుంది. శ్రీకృష్ణుడు ఎంత భోగియో అతని బాల్య లీలల వైభోగం , అష్టమహిషులు, 16 వేల మంది గోపికలు పొందిన సుఖ సంపన్నత అందరికి తెలిసినదే. అనేక తత్త్వాలను గోపికలకు, అక్రూరునకు, ధర్మరాజుకు, ఉద్దవునకు ఉపదేశించిన విషయం జగమెరిగిన సత్యం. సాక్షాత్తుగా యోగీశ్వరుడై అర్జునునకు భగవద్గీత, ఉత్తర గీతను ప్రబోధించెను. అందరితో అనురాగములను అనుభవించినను విరాగిగా, అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు. సత్యభామా విధేయుడు, దక్షిణ నాయకుడు అయ్యెను. ''కృష్ణ'' శబ్దానికి కష్టాలు తీర్చేవాడు. కలిమి నిచ్చేవాడు. విశ్వాన్ని తన రూప గుణాతిశయంతో ఆకట్టుకునేవాడు అని వ్యాఖ్యాతలు అర్థం చెబుతారు! శ్రీమహావిష్ణువుకే తల్లిదండ్రులయ్యే అదృష్టం దేవకీ వసుదేవులకు దక్కింది! అది పూర్వజన్మలో వారికి భగవంతుడిచ్చిన వరం. ఇక నంద, యశోదల భాగ్యం ఇంతని చెప్పలేము. గోకులంలో నంద యశోదల ముద్దుల తనయుడై పెరుగుతూ, ముద్దు మురిపాలతో వారి నలరించి, వ్రేపల్లెలో తనకై ఎదురుచూస్తున్న భక్తకోటిని మురిపించడం కోసం కోరి తరలి వెళ్లినవాడు. ఇక శ్రీకృష్ణావతారం పరిపూర్ణమైన పరమానందభరితమైన ఆశ్రితులను ఆదుకొనేందుకై ధరించిన అవతారం! ద్వాపర యుగంలో రాక్షసాంశంగల వారెందరో ప్రభువులై ప్రజల్ని పీడించ సాగారు. ఆ సందర్భంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి, ధర్మాన్ని సంరక్షించడం కోసం శ్రీమహావిష్ణువు కృష్ణుడిగా అవతారం ధరించాడు. మహర్షులు, దేవతలు, గోప, గోపి జనంగాను, ఆదిశేషుడు 'బలరాముని'గా , శ్రీకృష్ణుని అన్నగారిగాను, ఇంకా ఎందరో ఆయనను అనుసరించి జన్మించారు! శ్రీకృష్ణపరమాత్మ అవతరించినది మొదలు ప్రదర్శించిన దివ్యలీలలు ఎప్పటికి మరచిపోలేము.
శ్రీముఖ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమీ ఆదివారం రోహిణి నక్షత్ర యుక్త వృషభలగ్న పుష్కరాంశ సుము మూర్తమయిన సుమారుగా అర్థరాత్రి చంద్రుడు లగ్నంతోనూ, మిగతా ఆరు గ్రహాలు మీనంలోను 11వ ఇంటిలో ఉండగా అనగా ఆరు గ్రహాలు ఉచ్ఛలో నుండగా శ్రీకృష్ణుడు జన్మించెను.
''సర్వే గ్రహ: శుభ ఏకాదశ స్థాన ఫలదా, వరదా,
శుభదా, సుఖదా, సప్రసన్నా, సుముఖా భవంతు' అని అంటాం. ఏ గ్రహాలైన 11వ ఇంటిలో శుభం చేకూర్చును. కావున శుభలగ్నాన, అన్ని గ్రహాలు ఉన్నత స్థానంలో నుండగా జన్మించుటచే మహితాత్ముడై, అజేయుడై, త్యాగియై భోగియై, రాగియై, విరాగియై, నిరోగియై, యోగీశ్వరుడై, స్ఫుర ద్రూపియై, తత్త్వవెెత్తయై, కొంగు బంగారమై, సంపూర్ణా యుష్మంతుడై జీవించినాడు.
''శ్రావణ బహుళ అష్టమి ''శ్రీకృష్ణ జయంతి! ''అష్టమి'' ఎనిమిదవ తిథి! ఈ ఎనిమిది అంకెతో చాలా సంబంధమే ఉంది శ్రీకృష్ణమూర్తికి! ''ఓం నమోనారాయణాయ'' ఎనిమిది అక్షరాలుగల మంత్రం! దశావతారాలలో ఎనిమిదవది కృష్ణావతారం! దేవకీదేవికి ఎనిమిదవ సంతానం ఆయన. అదీకాక, కృష్ణుడు జన్మించినదీ ఎనిమిదవ నెలలోనెనట! కృష్ణాజన్మస్థానమైన చెరసాలకు ఎనిమిది ద్వారాలున్నాయట! కృష్ణునికి ధర్మపత్నులు ఎనిమిది మంది. ఏనాడు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిందో ఆనాడే కలియుగం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు 125 సం 7 మాసాల 7దినములు జీవించిట్లు శ్రీ మహాభారత సారోద్దారమనే గ్రంథంలో మూడవ భాగంలో చర్చించి నిర్ణయింపబడింది. శ్రీమద్భాగవత ఏకాదశ స్కంధమున 6వ అధ్యాయమున 25వ శ్లోకాన
ఇలా వుంది.
యదోర్వం శేవ తీర్ణస్య, భవత: పురుషోత్తమ
శరచ్ఛతం వ్యతతస్య, పంచావింశాధికం విభో
పోతన భాగవతమున కూడా అలాగే ఉంది.
కృష్ణాష్టమి రోజు కృష్ణ వ్రతం చేస్తారు. ఈ రోజు శ్రీకృష్ణుని జన్మ దినంగా భావించినంత మాత్రం చేతనే ఏడు జన్మల చెడుతలపుల యొక్క పాపం నశించి పోతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. రోహిణీ నక్షత్రం ఉన్నట్లయితే మధ్యాహ్నం ఉసిరి చూర్ణం, నువ్వులతో స్నానం చేసి, నివాస గృహం మధ్యలోగాని, గుళ్లోగాని, ముగ్గులు పెట్టి, వాటి మీద బియ్యం పరిచి, దానిమీద మంచి నీళ్లు, నవరత్నాలు ఉన్న కొత్త కలశాన్ని ప్రతిష్టించి శక్త్యానుసారంగా ఏదైనా లోహంతో బాలకృష్ణుని ప్రతిమను చేసి, ఆ కలశం మీద ఉంచి, దేవకీ దేవిని ప్రార్థించి అనంతరం శ్రీకృష్ణుని ప్రార్థించాలి. చంద్రో దయ వేళ శంఖసమేతులై వెళ్లి స్నానం చేసి శంఖంతో చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం కొబ్బరి నీళ్లతో అర్ఘం ఇవ్వాలి. రాత్రికి జాగరణ ఉండి, మర్నాడు ఉదయం స్నానం చేసి, పున: పూజ చేసి కర్పూర హారతి నిచ్చి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలంతో సత్కరించి, బంధుమిత్రులతో కలిసి భోజనం చెయ్యాలి. అష్టమితో రోహిణి నక్షత్రం కూడా కలిస్తే అది శ్రీకృష్ణజయంతి. ఆ రోజున కృష్ణుని పూజించి పెరుగు, పాలు ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఉట్ల పండుగ చేసుకుంటారు. కుండలు పగులగొట్టుటలోని విశేషం దాన దర్మాలు చేయనివారి బ్రతుకులు వ్యర్థమని తెలుపుట కోసం అంటారు. మహారాష్ట్రలో ఈ ఉత్సవాన్ని గోపాల కాలం అంటారు.
కృష్ణాష్టమి పండుగ వచ్చిందటే సందడే సందడి. ఒక వైపు రాత్రి పూజ చేయడానికి సన్నాహాలు, మరోవైపు ఉట్టికొట్టడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతాయి. యువకులు, ముసలివారు అన్న వయోబేధం లేకుండా అందరూ ఉట్టి సంబరాల్లో పాల్గొంటారు. బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్లల్లోకి తన స్నేహితులతో వెళ్లి తనకిష్టమైన పాలు, పెరుగు, వెన్న దొంగలించేవాడు. తను తిని అందరికీ పెట్టేవాడు. ఆ కృష్ణపరమాత్మ తన స్నేహితులను నేలమీద ఒకరివీపుపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న, పెరుగు తినేవారని అంటారు. ఈ కృష్ణలీలలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టి కొట్టడం. ఇప్పటికీ పల్లెటూర్లలోనూ, పట్టణాలలో కొంతమంది ఈ సంబరం జరుపుకుంటున్నారు.
యువకులందరూ బాగా ఎత్తుగా ఉట్టె కట్టి ఒకరు ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరు అటూ ఇటూ నుంచుని వారిపై రంగురంగుల నీళ్లు జల్లుతూ ఉంటారు. ఇలా చాలా సేపు ఆడుకున్నాక ఎవరో ఒకరు ఆ ఉట్టిని కొడతారు. జన్మాష్టమిని అందరూ పండుగలా జరుపుకుంటారు. ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేస్తారు. ఇళ్లల్లోనూ, గుడిలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఓపిక ఉన్నవారు ఉదయం నుంచి రాత్రివరకు ఉపవాసం ఉండి పూజ చేసే వారు సాయంత్రం మళ్ళీ స్నానం చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి మినపసున్ని ఉడకబెట్టిన శనగలు, పాయసం, గారెలు, చిట్టిగారెలు (మినప పిండి, వరి పిండితో తయారు చేసినవి), పులిహోర ఇలా ఎవరి శక్తిమేరకు వారు ఇరవై ఒక్క రకాలపిండి వంటలు తయారు చేస్తారు. పరమాత్మకు ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న కూడ నైవేద్యం పెడతారు. రాత్రి ఎనిమిది గంటలకు మొదలు పెట్టి పూజలు భజనలు చేస్తారు. రాత్రిపన్నెండు గంటల సమయంలో దేవుడికి నైవేద్యం పెడతారు. ఊయలసేవ చేసి కృష్ణుడిని పడుకోబెడతారు. ఇలా ఎందుకు చేస్తారంటే లోక కల్యాళార్థం భూలోకంలో ఆ మహావిష్ణువు అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలోనే కృష్ణుడి రూపంలోజన్మించాడు కనుక.
ఆ చిన్ని శ్రీకృష్ణుడు తమ ఇంట్లోకి రావాలని అందరూ తమ ఇంటి గేటు దగ్గర నుంచి ఇంట్లోకి ముగ్గుతో చిన్నిచిన్ని పాదాలను వేస్తారు. ఆ పాదాల మీద కృష్ణుడు నడిచి వస్తాడని భక్తుల విశ్వాసం.

No comments:

Post a Comment