Sunday, July 20, 2014

మనం వెనుకబడిలేమా ?

మనమెక్కడున్నాం ?
మనము సనాతన ధర్మము , సాంప్రదాయాలు , అంటూ మనగొప్పతనాన్ని చెప్పుకుంటున్నామేగానీ , నిజంగా అందులోని సారాంశాన్ని తెలుసుకొని పాటిస్తున్నామా ? అనిపిస్తుంది , ఒకోసారి. ఎందుకంటే మన వేదాలని అర్థం చేసుకొని , వాటి సారాంశాన్ని ఉపయోగిస్తూ మనకన్నా ఎక్కువగా పాటించేవారు.. విదేశాల్లో ఎక్కువ ఉన్నారని అవగతమవుతున్నది.
యజుర్వేదపు మొట్టమొదటి మంత్రము.. " ఇషేత్వోర్జేత్వా వాయవస్థో పాయవస్థ... -----బహ్వీర్యజమానస్య పశూన్ పాహి "
పై మంత్రార్థము చూస్తే , ఇది పశువులను , ముఖ్యంగా వత్సములను ( దూడలను ) కాపాడుటకోసం ప్రయోగించబడుతుంది. దర్శ యాగములో ఇంద్ర దేవతలకు పెరుగును ’ హవిస్సు ’ గా అర్పిస్తారు. ఆ పెరుగు దొరకాలంటే గోవులను ఆశ్రయించక తప్పదు. పాలు దొరికితేనే కదా , పెరుగు తయారయ్యేది ! ఆ పాల కోసము , ఆవుదూడలను కొంతపాలు తాగిన తర్వాత తల్లినుండీ వేరు పరచక తప్పదు. పాలు కావాలంటే ఇదే విధి. ఆ దూడలకు , వేరే ఆహారాన్ని ఏర్పాటు చేయాలి. దూడలను ఆవునుండీ వేరు చేయాలంటే , వాటిని బెదిరించో , ఆశపెట్టో ఆ పని చేయాలి. వాటికి హింస కలుగరాదు. కాబట్టి , ఒక మోదుగ కొమ్మను చెట్టునుండీ కత్తరించి , ఆకులు గల ఆకొమ్మతో దూడలను అదిలిస్తారు. తర్వాత వాటిని పచ్చిక మేయడానికి పంపిస్తారు. వాటికేమాత్రం బాధ కలగరాదని , వాటిని ఇలాగ ప్రార్థిస్తారు. " ఓ దూడలారా , మీరు వాయువులు కండి ( అంటే , ఇంకో అర్థము , మాతృ సమీపము నుండీ దూరము వెళ్ళండి.) . ఆ వాయువే మిమ్మల్ని రక్షించు గాక ( పశువులకు దేవత అంతరిక్షము , ఆ అంతరిక్షానికి అధ్యక్షుడు వాయువు ) గడ్డి మేసి , సాయంకాలానికి మరలా యజమాని ఇంటికి తిరిగి రండి.."
తర్వాత , గోవులను ఇలాగ ప్రార్థిస్తారు, " ఓ గోవులారా , సర్వప్రేరకుడైన ఆ సవితృ దేవుడు మిమ్మల్ని శ్రేష్టమైన కర్మ అగు యాగానికి హవిస్సును కలుగజేయుటకు ప్రేరేపించనీ.. దేవతలకు ఇవ్వతగిన పాలు , పెరుగు , నేయి మొదలైనవి , మీనుండీ గాక , ఇంకెక్కడ లభించును ? గోవులారా , మీరు హింసకు ఏమాత్రమూ అర్హురాళ్ళు కాదు. ( గోవులను ’ అఘ్ని ’ అని అంటారు... అంటే హింసింపకూడనివి ) మీరు మొదట మీ బిడ్డలకు , తర్వాత మనుషులకూ పాలిచ్చి , పుష్టిని కలిగిస్తున్నారు. ఇప్పుడు బాగా గడ్డి మేసి , ఇంద్రాది దేవతలకు కావలసిన హవిస్సును కూడా ఇవ్వండి.. మిమ్మల్ని , దొంగలు అపహరించకుందురు గాక. కౄర మృగాలు హింసింపకుండు గాక , రుద్రుడూ , రుద్రాయుధాలూ మిమ్మల్ని తాకకుండు గాక ( రుద్రుడి పని , కనిపించినవారిని హింసించుటయే ) మీ సంతతి వృద్ధియై , యజమానుని శాల నిండనీ !
తర్వాత , మోదుగ చెట్టును ( కొమ్మను ) ఇలాగ ప్రార్థిస్తారు. ఓ పాలాశమా , దేవతలకు కావలసిన ఆహారము కోసము , నిన్ను వాడుకుంటున్నాను. నిన్ను నమస్కరించి నిన్ను కత్తరిస్తున్నాను. దూడలు నిన్ను చూడగనే , బెదురు లేకుండా మరలిపోయేటట్టు చేయి , అలాగే యజమానుని గోవులను రక్షించు..
లోకకల్యాణార్థమై , ఒక్క యాగము కోసము , యాగము సక్రమంగా జరిగి , ఎవరికీ ఏ బాధా కలుగరాదని , వాటికి అవసరమైన అన్నిటినీ ప్రార్థించి గానీ మొదలుపెట్టని సంప్రదాయాన్ని మనకు వేదము నేర్పింది.. ఇవే కాదు , ఇంకా వేరు మంత్రాలలో , మట్టినీ , నీటినీ ఇతర పదార్థాలనీ ఇలాగే ప్రార్థించే సన్నివేశాలు కనిపిస్తాయి.
ఈ అవగాహన లేకుండా , ఈనాడు మనుషులను మనుషులే విపరీతంగా హింసించుకుంటూ , సనాతన ధర్మపరాయణులమని చెప్పుకుంటూ మనం చేసేది ఎవర్ని మెప్పించుటకు ?
నిన్న నాతమ్ముడితో ( Pavan Bhaskara ) మాట్లాడుతున్నపుడు కొన్ని ఆశ్చర్య కరమైన విషయాలు చెప్పాడు. అతడు జర్మనీలో ఉంటాడు.. మనం ఊహించుకునేట్టుగా , విదేశీయులందరూ మాంసాహారులూ , తాగి తందనాలాడేవారూ కాదనీ , చెట్లకు కూడా హాని కలిగించక బ్రతికేవారున్నారనీ అన్నాడు. అక్కడ అనేకులు , చెట్లనుండీ కాయలూ , పళ్ళూ కోయరట. అవే పండి రాలితే గానీ వాటిని తీసుకోరట. మనం మృత్యుంజయ మంత్రములో , " ఉర్వారుకమివ బంధనాత్ ... " అంటూ , పండిన పండువలె రాలిపోదామనీ , అపమృత్యువు రాకూడదనీ ప్రార్థిస్తాము.. దాని అర్థాన్ని తెలుసుకొని వారు ఎంతబాగా ఆచరిస్తున్నారు అనిపిస్తుంది. పాలు పిండితే పశువులకు బాధ అని , చాలామంది పాలు , పెరుగు ముట్టుకోరట.
అంతే కాదు , నూరేళ్ళనుండే అక్కడ సంస్కృతపు వాడకము ఉందనీ , ఇప్పటికీ సంస్కృతం లో వార్తలు ప్రసారమవుతాయనీ , వేదమంతా అనువదించి లైబ్రరీలలో నిక్షిప్తము చేసుకున్నారనీ అన్నాడు.
..
మనం వెనుకబడిలేమా ?

No comments:

Post a Comment