Wednesday, June 11, 2014

వృద్ధాశ్రమాలక్కరలేదు




Bramhasri Samavedam Shanmukha Sarma
వృద్ధాశ్రమాలక్కరలేదు!

ఈమధ్య తరచూ పత్రికలలో, టెలివిజన్ ఛానళ్ళలో కనిపిస్తున్న ఒకే తరహా వార్తలేమిటంటే ’వృద్ధులు-వృద్ధాశ్రమాలు’.
ఈ వృద్ధాశ్రమాలు - బాధ్యతలు తీరిపోయాక తల్లిదండ్రులు కావాలని ఎంచుకొని వెళ్తున్న వానప్రస్థాశ్రమాలు కాదు. వయసు మళ్ళిన తల్లిదండ్రులు ఆర్థికంగా తమకు భారమని భావిస్తున్న పిల్లల కారణంగా వచ్చి చేరిన వృద్ధులతోటీ, పిల్లలకి ఆర్థిక స్తోమత వున్నా పట్టించుకునే ఆసక్తి, అవకాశం వాళ్ళకి లేకపోవడం వల్ల వచ్చి చేరిన వృద్ధులతోటీ నిండిపోతున్న సత్రవుల వంటి ఆరామాలు.
ఇది మనకిప్పుడు అతి పెద్ద సమస్య. ఏ వృద్ధాశ్రమానికి వెళ్ళి, ఏ స్త్రీ పురుషుల్ని పలకరించినా కొంచెం తేడాతో అందరూ తామ్ "విడిచిపెట్టబడ్డాము" (abanddoned) అనే చెబుతారు. (అవసరం కాకపోయినా తమంతట తాముగా వచ్చినవాళ్ళు ఒకటీ అరా వుంటే వుండొచ్చు).
ఈ సహస్రాబ్ధి ప్రారంభమైందే ఈ సమస్యతో. మరి దీనికి పరిష్కారం మన పూర్వీకులు ఎలా ఇచ్చారో చూద్దాం..
వ్యక్తి ఆవిర్భావానికి, ఉనికికీ ప్రథమ, ప్రధాన ఆలంబన కుటుంబం. తొలి అనుబంధం తల్లిదండ్రులు. ఆ తరువాతనే ప్రపంచమంతా. అందుకే మాతాపితరులను దైవాలుగా సంభావించిన భవ్య సంస్కృతి మనది.
’మాతృదేవోభవ - పితృదేవోభవ’ అని నిర్దేశిమ్చిన వేద వాజ్ఞ్మయం, పలుతావుల్లో మాతాపితరుల ఔన్నత్యాన్ని మంత్రమయంగా చాటిచెప్పింది. అటుపై రామాయణం, భారత భాగవతాలు, పురాణ వాజ్ఞ్మయం విస్తారంగా మాతాపితృభక్తిని ఆఖ్యానోపాఖ్యానాలలో, ధర్మసూత్రాలతో వ్యాఖ్యానించాయి.
తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ
తల్లిదండ్రులపై ప్రేమ, భక్తిలేని పుత్రుల బ్రతుకును చెదపురుగుల కంటే హీనంగా అభివర్ణించాడు వేమన. భాగవతంలో శ్రీకృష్ణుడు మాతాపితృశ్రద్ధని పరమాదర్శంగా లోకానికి చాటాడు. కంస సంహారం తర్వాత దేవకీ వసుదేవుల చెర విడిపించిన శ్రీకృష్ణుడు, బలరామునితో సహా వారి చరణాలకు నమస్కరిమ్చి పలికే మాటలు ప్రతివ్యక్తికీ ఆదర్శసూత్రాలు.

"తల్లిదండ్రులారా! మీరు మాకోసం చాలాకాలం ఉద్విగ్నులై వున్నారు. మా పసితనం చూసి మురిసే అవకాశం మీకు లభించలేద్. దురదృష్టవశాత్తు - మీ చెంత వుండే భాగ్యం మాకు దొరకలేదు".
’జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’ అని కాళిదాసు రఘువంశ కావ్యానికి శ్రీకారం చుట్టాడు. అన్ని వంశాల వ్యాప్తికీ అది - పరమేశ్వర చైతన్యమే. ఆ చైతన్యాన్ని మాతాపితృ రూపంగా ధ్యానిస్తూ -
మాతాచ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః!
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్!!
అని మన సంప్రదాయం విశ్వసిస్తోంది.
’తల్లి పార్వతీదేవి - తండ్రి మహేశ్వరుడు. శివభక్తులు బాంధవులు, ముల్లోకాలు స్వదేశం’ - ఇది ఒక విశ్వజనీన భావన. ఏ మతం వారైనా ’ఈ అనంతలోకవాసులు పరమేశ్వరుని వారే’ అనే భావన కలిగివుంటే, ఇంక పరస్పర వైషమ్యాలుంటాయా? సౌభ్రాతృ భావనకి మూలకందం ఈ దర్శనం.
ఈశ్లోకంలో మరో భావాన్ని కూడా గమనించవచ్చు.
’పార్వతీ పరమేశ్వరులే మనకు తల్లిదండ్రులు’ - అనే భక్తి భావనతో పాటు ’మన తల్లిదండ్రులే ప్రత్యక్ష పార్వతీపరమేశ్వరులు’ అనే దృష్టి స్పష్టంగా ఉంది.
"కన్నవారు సంతానాన్ని ప్రేమించడం, నిరపేక్షంగా ఆదరించడం స్వాభావికం. ఇది నీరు క్రిందకి ప్రవహించడం వంటిది. కానీ సంతానం తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి వుండాలనడం బోధించవలసిన అంశం’ - అని పండితోత్తములు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారి మాట.
క్రిందికి వచ్చిన నీటిని ’మోటారు’ వంటి సాధనాల ద్వారా పైకి పంపుతున్నట్లే, ధర్మ బోధనల ద్వారా మాతాపితృ భక్తి పిల్లలకి ప్రబోధించవలసినదే.
సర్వార్థ సంభవో దేహో జనితః పోషితోయతః!
తయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్యః శతాయుషాః!!
ధర్మార్థకామ మోక్షాలను, అన్ని ప్రయోజనాలను సాధించే ఈ శరీరం, ఏ తల్లిదండ్రులనుండి పుట్టి రక్షింపబడిందో, ఆ తల్లిదండ్రుల ఋణాన్ని మానవుడు నూరు సంవత్సరాలు జీవించి వున్నప్పటికీ తీర్చుకోలేడు.
సామర్థ్యమున్నప్పటికీ కుమారుడు దేహంతోను, ధనంతోను తల్లిదండ్రుల్నిపోషించకపోతే, పరలోకంలో వాడి మాంసాన్ని వాడే తినే నరకాన్ని అనుభవిస్తాడు.
మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుమ్!
గురుం విప్రం ప్రపన్నంచ కల్పోచిభ్రచ్ఛవసన్ మృతః!!
సమర్థుడైన మానవుడు తల్లినీ, తండ్రినీ, కులవృద్ధులను, పతివ్రతయైన భార్యనీ, శిశువైన పుత్రునీ, గురువును, విప్రునీ, ఆశ్రయించిన వారిని పోషింపకపోతే జీవించి వున్నా మరణించిన వానితో సమానం.
"కంసుని దుర్మార్గం వల్ల పరాధీనులమై మీకు దూరంగా వున్న కారణంగా ఇన్నేళ్ళూ మిమ్మల్ని దర్శించలేకపోయామ్. ఆ దోషాన్ని మన్నించండి" - అని శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులతో విన్నవించుకున్నాడు (భాగవతం).
పుత్రులకు తల్లిదండ్రులపట్ల వుండవలసిన గౌరవం ఈ మాటల్లో వ్యక్తమౌతోంది.
సర్వజగతికీ కారణమై, పోషకమై, రక్షకమైన పరమేశ్వరుని కూడా మాతాపితృ భావంతో ఆరాధించే సంస్కృతి మనది.
తల్లిదండ్రుల వాత్సల్యం స్వాభావిక ప్రకృతి, పిల్లలకి తల్లిదండ్రులపై ప్రేమ ధార్మిక ప్రకృతి. ఆ ప్రకృతిని పెంపొందించడానికై మన ధర్మ వ్యవస్థ కృషి చేసింది.
అనేక తపస్సుల కంటే తల్లిదండ్రులపై,గురువులపై భక్తి శక్తిమంతమైనదని ధార్మిక వాజ్ఞ్మయం పలువిధాల ఘోషిస్తోంది.
శ్రీరామకృష్ణాదుల మాతాపితృ భక్తిని పేర్కొన్న తరువాత శ్రవణకుమారుని, ధర్మవ్యాధుని వంటి వారి శ్రద్ధని ప్రశంసించాలి. రామాయణంలో శ్రవణకుమారుని అమోఘమైన శ్రద్ధను కొనియాడారు. మహాభారతంలో -ధర్మవ్యాధుడనే మాంసవిక్రేత కేవలం స్వధర్మపాలన ద్వారానే జీవిస్తూ, అమ్మానాన్నల పట్ల తన విధులను నిర్వర్తిస్తూ, సత్యాహింసాది సాత్త్వికప్రవృత్తుల ద్వారా గడిపిన గాధను ప్రశస్తంగా కీర్తించారు.
తపస్సు చేసే ఒక బ్రాహ్మణుని కంటె స్వధర్మ నిర్వహణ అనే తపస్సు నాచరించిన అతి సామాన్యుడైన ధర్మవ్యాధుని అసామాన్య ధీగుణాన్ని భారతం ప్రస్తుతించింది.
అన్ని ధర్మాలకంటే ఆదిగా చెప్పిన మాతాపితృ గురుభక్తిని ఆధారం చేసుకొని, మిగిలిన ధర్మాలన్నీ వర్థిల్లుతాయన్నది సర్వధర్మాల సారం.
ఈ సంస్కారాన్ని పిల్లలకి నూరిపోస్తే తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాల్ని ఆశ్రయించే దుస్థితి ఎందుకు వస్తుంది?



No comments:

Post a Comment