Wednesday, June 18, 2014

రాణా ప్రతాప్ సింగ్! --> వనం వెంకట వరప్రసాదరావు గారు

పూర్తి  సమాచారము కోసం రాణా ప్రతాప్ సింగ్!
భారత రాజపుత్ర వీరుల రక్తంతో తడిసిన కారణంగానేమో, మధ్య భారతంలో నేల ఇప్పటికీ
ఎర్రగా కనిపిస్తుంది!
1576 లో జరిగిన హల్దీ ఘాటీ యుద్ధం భారత భూమి మీద జరిగిన గొప్ప యద్ధాలలో,
భారత వీరుల ధైర్య, శౌర్య, పరాక్రమాలను ప్రపంచానికి చాటి చెప్పిన యుద్ధాలలో ఒకటి!
అక్బర్ చక్రవర్తి సింహాసనం అధిష్టించిన తర్వాత అనేక మంది రాజ పుత్రులు తమ
అక్క చెల్లెళ్ళను, కుమార్తెలను అక్బర్ కిచ్చి వివాహం చేసి రాజపుత్రుల మానాన్ని
భారతీయుల ఆత్మ గౌరవాన్ని మంట గలిపారు. రాణా ప్రతాప్ సింగ్ వంటి వీర భారత
పుత్రులు కొందరే ప్రాణాలను పణంగా పెట్టి అక్బర్ కి వ్యతిరేకంగా పోరాడారు!
మధ్య భారతం లోని మేవాడ్ అనాదిగా వీర రాజపుత్రుల క్రీడా ప్రాంగణం. మేవాడ్ కు
చెందిన శిశోడియా వంశీయుల లో బాప్పా రావాల్, రాణా హమీర్, రాణా సంగ వంటి
ఎందరో మహావీరులు, దేశ భక్తులూ వున్నా '' మహా రాణా '' అని పిలువబడిన వాడు రాణా
ప్రతాప్ సింగ్ ఒకడే! 1540 లో జన్మించిన రాణా ప్రతాప్ సింగ్ మేవాడ్ రాజు ఉదయ సింహునికి
వున్న 23 మంది కుమారులలో పెద్ద వాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన పిరికివాడైన ఉదయ సింహుడు చితోడ్ గడ్ రాజుగా వున్నప్పుడు, స్వతంత్ర రాజ్యమైన
చితోడ్గడ్ మీద 1568 లో అక్బర్ యుద్ధం ప్రకటించాడు. ఉదయ సింహుడు ఆరావళీ కొండల్లోకి పారిపోయి అక్కడ ఉదయపూర్ అనే నగరాన్ని నిర్మించుకున్నాడు. చితోడ్, మేవాడ్ అక్బర్ వశమైనాయి. ఆ తర్వాత 4 సంవత్సరాలకు మరణిస్తూ ఉదయ సింహుడు, సంప్రదాయానికి విరుద్ధంగా పెద్ద కుమారుడు, మహా వీరుడు, సద్గుణ సంపన్నుడు, ప్రజలకు, మంత్రులకూ
ప్రియుడు ఐన రాణాప్రతాప్ సింగ్ ను కాదని, తన చిన్న రాణి కొడుకు, దుర్మార్గుడు,
ఎందులోనూ రాణా ప్రతాప్ కు సరిపోలని 'జగమల్లు' ను తనకు వుత్తరాదికారిగా ప్రకటించాడు. మంత్రులు, ప్రజలు అంగీకరింపక, రాణా ప్రతాప్ ను బలవంతం చేస్తే, అతను రాజ్యాన్ని
స్వీకరించాడు. కసితో జగ మల్లు, రాణాప్రతాప్ స్వంత తమ్ముడైన శక్తిసింహుడు అసూయతో రగిలిపోయి అక్బర్ పక్షాన చేరారు.
తన మంత్రులను, సామంతులను, ప్రజలను సమావేశం చేసి, చితోడ్ ను తిరిగి స్వాధీనం
చేసుకుని, మేవాడ్ పరువును నిలబెట్టేదాక, రాజపుత్రుల అభిమానాన్ని ప్రపంచానికి
తిరిగి తెలియజేసే దాకా రాజ లాంఛనాలను స్వీకరించనని, ఆకులలో నే తింటాననీ,
నేలపైనే పడుకుంటా ననీ భీష్మ ప్రతిజ్ఞ చేశాడు రాణా ప్రతాప్ సింగ్.
జయపూర్ మహారాజు బీహార్ మల్ కుమారుడు, మహా వీరుడు ఐన మాన్ సింగ్ ను అక్బర్
రాణా ప్రతాప్ వద్దకు దూతగా పంపి తనను చక్రవర్తిగా అంగీకరించి, సామంతుడిగా ఉండమని,
లేకుంటే యుద్ధానికి సిద్ధంకమ్మని రాయబారం పంపించాడు. రాయబారానికివచ్చిన మాన్ సింగ్
ను కలుసుకోడానికి, అతనితో కలిసి భోజనం చేయడానికి రాణా ప్రతాప్ తిరస్కరిస్తే కోపోద్రిక్తుడైన
మాన్ సింగ్ భోజనం చేయకుండా..కొన్ని మెతుకులు తన అంగ వస్త్రం లో మూట గట్టుకుని
వెళ్ళాడు అన్నపూర్ణను తిరస్కరించకూడదు అని! యుద్ధానికి సిద్ధంగావుండి తనను
కలుసుకొమ్మని రాణా ప్రతాప్ తో చెప్పి గుర్రం ఎక్కాడు..'' నీ స్వంత సైన్యంతో వస్తే రాజ
లాంచనాలతో స్వాగతం పలుకుతా..అక్బర్ సైన్యంతో వస్తే నా కత్తితో స్వాగతం పలుకుతా అని జవాబిచ్చాడు రాణా ప్రతాప్!
రెండు లక్షల సైనికులనిచ్చి, మాన్ సింగ్ నాయకత్వం లో, తన పంచన చేరిన రాణాప్రతాప్
తమ్ముడు శక్తి సింగ్ ను, తన కుమారుడు సలీం ను తోడు గా పంపాడు అక్బర్ రాణా ప్రతాప్
మీదికి. అక్బర్ కి భయపడి, అతని కానుకలకు ప్రలోభ పడి అతనితో చేతులు కలిపిన వాళ్ళు
పోగా మిగిలిన వాళ్ళను తీసుకుని, తన రాజధానిని కొండల ప్రాంతమైన 'కుంభల్ గడ్' కి మార్చి,
ఇరవై రెండు వేల మంది సైనికులతో హల్దీ ఘాట్ కి చేరుకొని అక్బర్ సైన్యానికి స్వాగతం పలికాడు
రాణా ప్రతాప్.
రెండు ప్రక్కలా కొండల మధ్యన ఇరుకైన దారితో వున్న ప్రాంతం హల్దీ ఘాట్. ఆ కనుమలో
చొరబడిన వాళ్ళను కొండ రాళ్ళు దొర్లించి, గెరిల్లా యుద్ధపద్ధతిలో, నల్లుల్లాగా నలిపేశారు రాణా
ప్రతాప్ సైన్యంలోని రాజ పుత్ర వీరులు, గిరిపుత్ర వీరులు. రెండులక్షల అపార సైన్యం కనుక ఆ కనుమను దాటి, తర్వాత మైదాన ప్రాంతం లో జరిగిన భీకర పోరాటం లో ఒకసారి మాన్ సింగ్,
ఒక సారి యువరాజు సలీం రాణా ప్రతాప్ చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా బయట పడ్డారు. తానొక్కడే వందలాది మొఘల్ సైనికులను సంహరించిన రాణాప్రతాప్ చక్ర బంధంలో
ఇరుక్కు పోయి, నాలుగు ప్రక్కలా తనను కమ్మిన సైనికులతో పోరాడుతూ నిలువెల్లా
గాయాలతో రక్తమోడుతుంటే అతని ధ్వజాన్ని గుర్తు పట్టి మాన్ సింగ్, సలీం, మొఘల్ సైనికులు అతడినే లక్ష్యంగా మొహరిస్తున్నారని కనిపెట్టిన ఒక మహా వీరుడు, 'ఝాల' ప్రాంతానికి రాజైన
'మాన్ సింగ్' అనే వీరుడు బలవంతంగా రాణాప్రతాప్ చత్రాన్ని తను తీసుకొని, ఆయన
కాళ్ళమీద పడి'' ఈ స్థితిలో మీ అవసరం దేశానికి వున్నది. మీరు లేకుంటే మేము ఇందరం
వున్నా ప్రయోజనం లేదు కనుక వీళ్ళను నేను అడ్డుకుంటాను, మీరు వెళ్ళండి'' అని
రక్తమోడుతూ మాట్లాడే శక్తి కూడా లేకున్నా యుద్ధ రంగంలో నిలిచిన రాణా ప్రతాప్ సింగ్ ను బలవంతంగా అతని గుర్రం ఐన 'చేతక్' పైకి ఎక్కించి స్పృహలేని స్థితిలోవున్న రాణా ప్రతాప్ ను
అక్కడి నుండి పంపించాడు.
ధ్వజాన్ని బట్టి, కిరీటాన్ని బట్టి అతనే రాణా ప్రతాప్ అని అక్కడికి మోహరించిన మాన్ సింగ్,
సలీం, ఇతర మొఘల్ సైనికులతో వొంటరిగా పోరాడుతూ, ఎందరినో సంహరించి, చివరికి తను బలిదానం చేశాడు ఈ మాన్ సింగ్!!
స్పృహ లేని రాణా ప్రతాప్ ను , అతని ప్రియమైన గుర్రం 'చేతక్' అది కూడా ప్రాణాంతకమైన
గాయాలతో వుండి తీసుకెళుతుంటే ఇద్దరు ముఘల్ సర్దారులు దూరంనుండి గమనించి వెంట
బడ్డారు. అప్పటి వరకూ మొఘల్ సైనికులతో కలిసిపోయి తన అన్నకు వ్యతిరేకంగా యుద్ధం
చేస్తున్న శక్తి సింగ్ ఇది గమనించి, పోరాడేస్థితిలోలేని తన అన్నను వెనుకనుండి
సంహరించడానికి ప్రయత్నిస్తున్న ఆ సర్దారులిద్దరినీ తను సంహరించాడు! చేతక్ పడుతూ
లేస్తూ పరుగులు తీస్తూనే వున్నది. వెనుకనుండి శక్తి సింహుడు పెద్దగాపిలుస్తూ వస్తుంటే
స్పృహలోకి వచ్చిన రాణాప్రతాప్ తన తమ్ముడి గొంతు గుర్తు పట్టి, గుర్రందిగి కత్తిపట్టుకున్నాడు.
శక్తి సింగ్ అన్న పాదాల మీద పడి తన తప్పును మన్నించ మని వేడుకున్నాడు. తమ్ముడిని కౌగిలించుకున్నరాణాప్రతాప్ అతన్ని క్షమించి మరలా తన గుర్రాన్ని ఎక్కాడు. స్పృహ
కోల్పోయాడు. అంతవరకూ ప్రాణాలకు తెగించి తన యజమాని ప్రాణాలు కాపాడడానికి
ప్రయత్నించిన ఆ గుర్రం 'చేతక్' అడ్డుగా వచ్చిన శత్రువుల దెబ్బలకు గాయ పడుతూ, దౌడు
తీస్తూ మార్గం లో అడ్డుగా వచ్చిన ఒక పెద్ద కాలువ ఇవతలి గట్టు మీదినుండి అవతలి గట్ట్టుకు
ఎగిరి దూకి..అక్కడితో తన శక్తిని పూర్తిగా కోల్పోయి..అక్కడే మరణించింది!18-06-1576 న,
తనకు అత్యంత ప్రియమైన తన అశ్వం మరణించిందని తీవ్రంగా విలపించిన రాణా ప్రతాప్
అది ప్రాణాలు విడిచిన చోటే దానికి ఒక అందమైన ఉద్యాన వనాన్ని నిర్మించాడు, ఈ నాటికీ
అది సందర్శకులకు స్వాగతం పలుకుతున్నది. ఆ అశ్వంఇచ్చిన స్ఫూర్తితోనే బజాజ్ సంస్థ
తన స్కూటర్ కి బజాజ్ చేతక్ అని పేరు పెట్టింది. ఈ రోజు 'ఈ చేతక్' కూడా దాదాపూ
కనుమరుగైంది!
ఆ తర్వాత ఆరు నెలలపాటు తనను వెంటాడుతూనే వున్న మొఘల్ సైనికులను ముప్పు
తిప్పలు పెడుతూ వారిని మట్టికరిపిస్తూ కొండలూ కోనలూ పట్టుకు తిరిగిన మహా రాణాప్రతాప్
రాణికి, తన పిల్లలకు ఒక పూట రొట్టె కూడా పెట్టలేని సంకట పరిస్థితులలో కూడా ఎదురు
దాడులు చేస్తూ చివరికి పిల్లల, ప్రజల, రాణి యొక్క దైన్యాన్ని తట్టుకోలేక రాయబార సందేశం
పంపితే అక్బర్ నమ్మలేక ఆ లేఖను తన కొలువులో కవి ఐన మరొక రాజ పుత్ర వీరుడైన పృధ్వీ రాజు, బికనీర్ రాజకుమారుడు, రాణా ప్రతాప్ భక్తుడు, మొఘల్ కొలువులో నిత్యమూ ఆత్మ ప్రబోధానికీ వ్యతిరేకంగా బ్రతుకుతున్నవాడు, అతనికిస్తే, అతడు ఆ లేఖను గుర్తించి కూడా, ఇది రాణాప్రతాప్ రాసింది కాదు, మీరు అనుమతిస్తే నేను అతనికి యే విషయమూ తేల్చుకోడానికి ప్రత్యుత్తరం వ్రాస్తానని చెప్పి, అక్బర్ అంగీకారంతో, రాజస్థానీ భాషలో ఒక లేఖ రాసి '' రాజస్తాన్ బజారులో ఒక్క రాణా ప్రతాప్ సింగ్ అనే రత్నాన్ని తప్ప మిగిలిన అన్నింటినీ అక్బర్ కొనుగోలు
చేశాడు. ఆ మిగిలిన రత్నం మీదనే రాజపుఠానా పరువూ మర్యాదలు ఆధారపడి వున్నాయి,
రాజ పుత్రవీరులందరికీ దైవం రాణా ప్రతాప్ సింగ్..అధైర్య పడవద్దు..అందరూ నీవైపే ఆశగా చూస్తున్నారు. నిన్నే శరణు వేడుతారు''అని రాశాడు అందులో. ఆది చదివిన రాణాప్రతాప్ తన
విరక్తి ని వదిలిపెట్టి మరలా యుద్ధ రంగంలోకి వచ్చి, మరలా సేనను సమీకరించుకోడానికి, ఈ
యుద్ధ భూమినుండి విరామం కోసం రాజస్తాన్ వదిలి సింధు నది ప్రాంతానికి వెళుతుంటే ఆ
వార్తను విన్న భామాషా అనే వృద్ధుడు, తన పూర్వీకులు రాణా ప్రతాప్ పూర్వీకుల కొలువులో పనిజేసిన వారు కనుక, తమ చక్రవర్తి తమ దేశాన్ని వదిలిపెడుతున్నాడని బాధపడి, రాణాప్రతాప్
ను కలిసి తనవద్ద వున్న అపార ధనాన్నిఅతనికి అప్పజేప్తే రాణా తిరస్కరించాడు. ఇది మీకోసం
కాదు. రాజపుఠానా రక్షణ కోసం నిధి. పాతిక వేల మంది సైనికులను పన్నెండు సంవత్సరాలు పోషించవచ్చు దీనితో. మీరు అంగీకరించకుంటే చచ్చిపోతాను అంటే అప్పుడు రాణా ఆ ధనాన్నిస్వీకరించి మరలా సైన్యాన్ని, ఆయుధాలను సమీకరించుకుని ఆ తర్వాత దాదాపు 9 సంవత్సరాలు అక్బర్ తో యుద్ధం చేస్తూనేవున్నాడు. తన చేత చిక్కిన అక్బర్ సైన్యాధికారుల భార్యలను సగౌరవంగా వారివారి అంతఃపురాలకుపంపించాడు. స్వయంగా అక్బర్ యుద్ధరంగంలోకి దిగినా, గెరిల్లా యుద్ధ పద్ధతులలో అతని గుడారం మీద కూడా దాడి చేసి కకావికలు జేశాడు.
అక్బర్ రంగంలో ఉండగానే గొంగ్డా, ఉదయపూర్ లను స్వాధీనం చేసుకున్నాడు. ఝంఝావతి, దేవియార్, కమల్ మేర, అమాయట్టి మొదలైన దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు! అక్బర్ కు ఎదురు తిరిగిన సిరోహీ రాజపుత్రుడు సుజనరావు చేతిలో అక్బర్ పంచన చేరిన రాణా ప్రతాప్
సవతి తమ్ముడు జగ మల్లు మరణించాడు.
దాదాపూ పది సంవత్సరాలు ప్రయత్నించినా అక్బర్ రాణా ప్రతాప్ ను వోడించ లేక పోయాడు,
రాణా ప్రతాప్ కూడా తన స్వప్నమైన మేవాడ్ ను చితోడ్ గడ్ ను వశపరచుకోలేక పోయాడు,
ఎక్కువ మంది రాజపుత్రులు సహకరించని కారణంగా, అక్బర్ సైన్యం వందల రెట్ల అధికం గనుక,
కానీ, మిగిలిన అన్ని దుర్గాలనూ అక్బర్ చేతినుండి స్వాధీనం చేసుకోగలిగాడు, ఐనా ఆ
మనాదితోనే, దశాబ్ద కాలం కొండల్లో, గుట్టల్లో నిరంతరం యుద్ధ రంగంలో అలిసిపోయిన శరీరానికి శాశ్వతమైన విశ్రాంతిని ఇచ్చి, తన కుమారుడైన అమర సింహుడిని తన కార్యాన్ని
కొనసాగించమని చెప్పి 19-01-1597 నాడు రాణాప్రతాప్ సింగ్ మరణించాడు. తను మరణించే
నాటికి మేవాడ్ రాజ్యం లోని మూడు దుర్గాలు తప్ప మిగిలిన వాటిని అన్నింటినీ తన స్వాధీనం
లోకి తెచ్చుకో గలిగాడు!
భారత వీరుల ప్రసక్తి వచ్చిన ప్రతి చోట వినబడే పేరు రాణా ప్రతాప్ సింగ్. జీవితాంతం తన
మాతృభూమిని రక్షించడానికి యుద్ధంసలిపిన వోటమినెరుగని వీరసింహం రాణా ప్రతాప్ సింగ్!!!
ఆయన అశ్వం చేతక్ ఈరోజే జూన్ పద్దెనిమిదవ తారీఖున తన యజమానికోసం మరణించింది!
భారత్ మాతా కీ జై!!!
--వనం వెంకట వరప్రసాదరావు
మూలము

No comments:

Post a Comment