Thursday, June 12, 2014

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి
ఆధునిక శాస్త్రాలను వ్యాఖ్యానించినట్లుగా ప్రాచీన శాస్త్రాలను వ్యాఖ్యానించడం వీలుకాదు. ఎందుకంటే ప్రాచీన శాస్త్రాలను ఆ శాస్త్రదృష్టితోనే కాకుండా ఇతర శాస్త్రాల దృష్టితోకూడా చూడాలి. ఒక్క యజుర్వేదాన్నే తీసుకొంటే ఆ వాఞ్మయాన్ని అనేక శాస్త్రాలదృష్టితో చూసినపుడు దాన్ని పూర్తిగా అవగతం చేసుకొన్నట్లవుతుంది. కర్మకాండల పరంగా, తాంత్రిక విద్యాపరంగా, ఆధ్యాత్మిక దృష్టితో, వైజ్ఞానిక దృష్టితో - ఇలా నాలుగు విధాలుగా చూసినపుడు ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది. ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!
రాజమహేంద్రవరంలో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి ఆయన శిష్యులు వేంకటేశ్వర శాస్త్రులు, ప్రశిష్యులు పి.సీతారామాంజనేయులు వంటివారు ఎన్నెన్నో విశేషాలు చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. అందులో అత్యంత ఆసక్తికరమైంది - ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమజర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయనపేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అనిచెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటోకూడా చెప్పారు...
తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యంనెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగుకోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు.అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు. ఒకవైపు సంస్కృతసాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆవిధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయంనుంచి జర్మన్లు అబ్ధిపొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.
దంతిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్రవిషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసుమార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం! బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతోవిపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు. తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచిపెట్టారు. ప్రపంచదేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు.
జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు. ఆయన రచనగా మనకు మిగిలినది - భుట్టోజీ దీక్షితుల వ్యాకరణ శాస్త్ర రచన అయిన సిద్ధాంత కౌముది! దీనిపై నాగేశభట్టు రాసిన లఘు శబ్దేందుశేఖర వ్యాఖ్య హైదరాబాద్‌ ప్రాచ్య లిఖిత గ్రంధాలయంలో అందుబాటులో ఉంది. మరి దండిభట్ల ఏమైనట్లు? ఈ ప్రశ్నకు కూడా మనకు సమాధానం దొరుకుతోంది. దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయలసొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభైరూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడువందల రూపాయలవంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబపింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరికొంత కాలానికి అదికూడా ఆగిపోయింది! అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం.
దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.

మూలము

No comments:

Post a Comment