తొలి రచన 16
-ద్వా.నా.శాస్ర్తీ,
September 13th, 2010
17వ శతాబ్దికి చెందిన గణపవరపు వేంకట కవి ఏకంగా కావ్యమంతా ఈ చిత్ర, గర్భ, బంధ కవిత్వంతో నింపేశాడు. కొన్ని పద్యాలు రాయడమే కష్టమైనప్పడు దాదాపు కావ్యమంతా రాయటానికి ఎంత ప్రతిభ ఉండాలో ఊహించలేం. పనె్నండవ ఏటనే కావ్యరచన ప్రారంభించిన కవి ఇతడు. యమశతకం, శృంగారమంజరి, కృష్ణమల్ల కధ, బాలరామాయణం, వేంకటేశ్వర నిఘంటువు మొదలైన రచనలు ఇరవైకి పైగా రాశాడు. అవన్నీ ఒక ఎత్తు. ‘‘ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము’’ ఒక ఎత్తు. ఇది తొలి చిత్ర, గర్భ, బంధ కావ్యం. అంతేకాదు-ఏకాశ్వాస కావ్యం. ఇదీ విశేషమే. వేంకటేశ్వరునికి ఆకాశరాజు కూతురికి జరిగిన వివాహమే ఇందులోని కథ. కథకంటే చిత్రకవితా భేదాలే ఎక్కువ. ‘సుఖసుప్తినున్న సమయంబున వేకువజామువేళ బాలవేంకట శౌరి ప్రత్యక్షమై’’ అంకితం కోరాడట. ఈ ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయవిలాస కావ్యం శ్రీపూండ్ల రామకృష్ణయ్యగారివల్ల వెలుగుచూసింది. శబ్ద చిత్ర సీసము, అనుప్రాసయుక్త అక్కలివడి సీసము, చౌపదములు, ద్వంద్వ ప్రాసకందము, సర్వలఘురూప సీసము, జాతి వార్తావచనము, గర్భిత చరణ దుర్ఘట సీసము, గర్భిత కందము, కటారికాబంధ కందము, రథబంధకందయు మొదలైనవెన్నో ఈ కావ్యంలో వున్నాయి. అయితే ఈ కావ్యంలోగల 808వ సీస పద్యం వంటిది ప్రపంచ సాహిత్యంలోనే లేదు. ఆపద్యం ఇది
‘‘సారాగ్య్రసారస సమనేత్ర యుగళ నారద రుచి కాంతిన రఘనపనిత
సారాగధీర విశదవీనతురగ భైరవభవ జైత్రభరశుభకరణ...’’
ఈ సీసపద్యంలో 64 పద్యాలున్నాయి. తేటగీతులు, ఆటవెలదులు, మంగళారతులు, శ్లోకములు, వృత్తములు, అష్టకములు, ఉత్కళికలు, 20 కందాలు, చేపదాలు అన్నీ కలిపి మొత్తం అరవె నాలుగున్నాయట! చాలావరకు పండితులు గుర్తించారు. ఇదీ మన భాషా ప్రాభవం మన పద్యరచనా వైభవం! అందుకే గణపవరపు వేంకటకవిని చిత్రగర్బ బంధకవిత్వాల పహిల్వాన్ అనటం!
మరిన్ని చిత్ర బంధ గర్భ కవితాదులు కోసం ఇక్కడ చూడండి.
No comments:
Post a Comment