నిర్భయ మీద డాక్యుమెంటరీ
చాలామంది, ఆ డాక్యుమెంటరీ లో తప్పేముంది ? నిజాలే కదా ? మనోభావాలను దెబ్బతీయలేదు కదా ? వాస్తవాలను అంగీకరించక, బ్యాన్ చేస్తే ఉపయోగమేమి ? అని అడుగుతున్నారు.
అయ్యా, మాంసము తింటారు కదా అని ఎవరూ ఎముకలు మెడలో వేసుకొని తిరగరు. ఎందుకు తిరగరంటే అదొక సంస్కారము.
ఆ డాక్యుమెంటరీ తీసినావిడ తన పద్ధెనిమిదేళ్ళ వయసులో మాన భంగానికి గురయ్యిందట . చాలా యేళ్ళు ఆత్మ న్యూనత తో బాధపడిందట. నిర్భయ కేసు , స్పందనలూ చూసి , ధైర్యము వచ్చి , తన తప్పేమీ లేదని గ్రహించి , అటువంటి కాముకుల మనస్తత్త్వాలు ఎలాగుంటాయో కనుక్కుందామని వచ్చిందట.
ఆమె ఉద్దేశం బాగున్నా , ఇక్కడికే ఎందుకు రావాలి? మెడ అటూఇటూ తిప్పి చూస్తే కాముకులు అక్కడే ఎక్కువ కనపడరా ? అంటే , నిర్భయ కేసును ఉపయోగించుకొని , శవం మీద మరమరాలు ఏరుకొనే ఉద్దేశమే కదా ? రామ్ గోపాల్ వర్మ 26/11 సంఘటనలో ఆ ప్రదేశాన్ని దర్శించుట కూడా అదే ఉద్దేశంతోనే కదా ? అంతే కాదు , భారత్ ను తక్కువ చేసి చూపించే ప్రయత్నమే ముఖ్యోద్దేశంగా కనబడుతుంది. దాన్ని కప్పిపుచ్చటానికి, నిజమో కాదో తెలీని తన అనుభవాన్ని అడ్డుపెట్టుకోవటమొకటి.
పైగా , ఆ డాక్యుమెంటరీ తీసేందుకు ఒప్పుకున్న షరతులను ఉల్లంఘించి బీబీసీ కి అమ్ముకుంది.
సరే , దాన్ని చూస్తే తప్పేమి , ఎందుకు బ్యాన్ చేయాలి?
పైన ’ సంస్కారం ’ గురించి ఉటంకించాను.
అంటే అదిచూస్తే మన సంస్కారాలు పాడవుతాయా ? అందరూ రేపిస్టులవుతారా ?
" అ.ను.మా.న.మా ? "
" ఎలా ?"
ఇక్కడే అందరూ అయోమయానికి లోనవుతుంటారు. ఏవో కొన్ని చూసినంత మాత్రానో , చదివినంత మాత్రానో , అవి మనల్ని ప్రభావితం చేస్తాయా ?
అది అర్థం చేసుకోవాలంటే మొదట సంస్కారాలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవాలి.
ప్రతి మనిషికీ అయిదు రకాల సంస్కారాలుంటాయి. ఈ అయిదింటిలో ఏది / ఏవి బలంగా ఉంటే మనిషికి ఆ ప్రవృత్తులొస్తాయి.
మొదటగా , మానవులందరికీ పుట్టుకతోనే , వచ్చే ఆత్మ సంస్కారము. అది అందరికీ సమానముగా ఉంటుంది.. ఏది మంచి , ఏది చెడు అర్థం చేసుకో గలిగే సంస్కారము.
రెండోది, పూర్వ జన్మ వాసనల వల్ల వచ్చేది. దీని వల్లనే కొందరికి దొంగతనమంటే అసహ్యము , కొందరికి మక్కువా. మనం ఈ రెండింటి గురించి ఏమీ చేయలేము. ఎలా వచ్చినదాన్ని అలా స్వీకరించడమే. అయితే , ఇవే మన ప్రవర్తనలను నిర్దేశిస్తాయి అని చెప్పుటకు వీలు లేదు. మిగిలిన మూడూ చాలా ముఖ్యమైనవి. వాటిని నియంత్రించ వచ్చు తద్వారా సంస్కారాలనూ , ప్రవర్తననూ మెరుగుపరచవచ్చు.
మూడోది, తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారము. ఇది ఇంటినీ , ఇంట్లోని ఆచారాలనూ , తల్లిదండ్రుల ప్రవర్తననూ బట్టి వచ్చేది. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. వారినుండీ పిల్లలు ఎన్నో చూసి, గమనించీ నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. అందుకే పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పూజలూ , ప్రార్థనలూ అనుష్ఠానాలు చేసేది.
నాలుగోది, వ్యక్తి ఇఛ్చాశక్తి అంటే విల్ పవర్ నుండీ వచ్చేది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా , దేన్నో చూసి ప్రేరణ పొంది , లేదా , యే గురువుగారినుండో ఉపదేశము పొంది, ’ తనకు అది దొరకాలంటే తాను ఇలాగుండాలి," అని గట్టిగా నిర్ణయించుకోవడము. అలాగే ప్రవర్తించడము. ఈ నాలుగోది కూడా మనిషి ప్రవర్తనకు ఒక కారణము.
ఇక , అయిదోది , ఇదే మనకు ప్రస్తుతము అయోమయాన్ని కలిగిస్తున్నదీ , రకరకాల వివాదాలకు కారణమవుతున్నదీను. అదే , పరిస్థితులూ , స్నేహితులూ , చుట్టూ ఉన్న వాతావరణపు ప్రభావము. దీన్ని కొంచం వివరంగా తెలుసుకోవలసిన అవసరముంది.
మనం ఏదైనా చూసినప్పుడో , చదివినప్పుడో , కొన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి [ ఈ ఆలోచనలకు కారణము ,కొంతవరకూ పైని మూడు సంస్కారాలే] . ఆ ఆలోచనలు ఊరికే వచ్చి పోతే ఫరవాలేదు , కానీ వాస్తవంలో అలా జరగదు. ఆ వచ్చిన ఆలోచనలు ఏదో ఒక అనుభూతిని కలిగిస్తాయి. అది సంతోషమో , కోపమో , కామమో , ఇంకేదో కావచ్చు. అటువంటి ఆలోచనలే పదే పదే వచ్చినపుడు , మళ్ళీ మళ్ళీ అవే అనుభూతులు కలుగుతాయి. అవి అలా మరలా మరలా కలగడము వలన వాటి ముద్రలు [ ఇంప్రెషన్ ] మనమెదడులో పడి, మనకొక ’ ధోరణి ’[ Attitude ] కలుగుతుంది. ఆ ధోరణికి తగినట్టే మనం ఇతరులతో వ్యవహరిస్తాము. మన ప్రవర్తన ఆ ధోరణిని బట్టే ఉంటుంది. మన ప్రవర్తన నుండీ మనం ఇతరులకు తదనుగుణమైన ఒక శక్తి , అంటే ’పాజిటివ్ ఎనెర్జీ’ లేక ’నెగెటివ్ ఎనెర్జీ ’ ని ప్రసారం చేస్తాము. వారు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది వారి సంస్కారాలను బట్టి ఉంటుంది.
మొత్తానికి మన ప్రవర్తనకు కారణము మన ధోరణి, ధోరణికి కారణము మన ఆలోచనలు , ఆలోచనలకు కారణము మనము చూసినవీ , చదివినవీ , విన్నవీ. వాటిని ఎన్నిసార్లు చూస్తే / చదివితే / వింటే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి ? అన్నది , మనిషి మనిషికీ మారుతుంది. ఇతర సంస్కారాలు గట్టిగా ఉంటే , ఆ ఆలోచనలు ఏమీ చేయలేవు. కానీ ఎవరి సంస్కారము ఎంత గట్టిదో ఎవరు చెప్పగలరు ? అందుకే చెడు వినవద్దు , చూడవద్దు , కనవద్దు అన్న సూత్రాన్ని మహాత్మా గాంధీ అంతగా నమ్మి మూడు కోతిబొమ్మలను తన దగ్గర ఉంచుకున్నది !
ఇప్పుడు చెప్పండి, వాటిని[ చెడు విషయాలను ] చూడటం మంచిదా ?
No comments:
Post a Comment