Wednesday, February 11, 2015

భారతీయ యోగ విజ్ఞానం

భారతీయ యోగ విజ్ఞానం
నేటి ఆధునిక మానవుడు దైనందిన జీవన సమస్యలతో కృంగిపోతూ తనను తాను నియంత్రించలేక అనేక ఆధునిక ఔషధాలతో ఈ సమస్య తొలిగించలేక యోగఃశరణం గచ్చామి అంటున్నాడు. మన భారతీయ సమాజం కూడా ఇటువంటి నాగరిక వ్యాధులతో సతమతమవుతూ ఉన్నది. వీరిలో చాలామంది నేడు ఉదయమే లేచి "యోగా" ఆచరిస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు పాశ్చాత్య దేశాలలో కూడా వేగవంతమైన, అనురాగ రహితమైన జీవన విధానానికి బలౌతున్న ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు యోగా ద్వారా ఉపశమనం పొందుతున్నారు. ఇందరిని ఆకర్షిస్తున్న "యోగ" భారతీయ ఋషి పరంపర అందించిన గొప్ప బహుమతి. యోగా అనగా అది కేవలం ఇప్పుడు మనం భావిస్తున్నట్లు ఆసనాలు మరియు రోగాలను తగ్గించే "థెరపీ" మాత్రమే కాదు, యోగా ఒక జీవన విధానం. భారతీయ సంస్కృతిలో అన్నింటా కనిపించే తత్వమే "యోగా". యోగా అనగా కలవటం అని అర్థం. జీవాత్మ - పరమాత్మతో కలవటం మొదలు ప్రతి అనుసంధానం ఒక యోగక్రియ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు 'యోగాని'కి నిర్వచనం చెప్పాడు. అసలు గీతయే ఒక యోగశాస్త్రం. స్థిత ప్రజ్ఞత సాధించటమే యోగం. "యోగఃకర్మసుకౌశలం" పనిలో నిపుణత సాధించటమే కర్మ, రాజయోగాలు. ఇది కాకుండా "హఠయోగ"మనే శరీరాన్ని ఆరోగ్యవంతం చేసే ఆసన ప్రక్రియ విశ్వవ్యాపితంగా ప్రసిద్ధి చెందింది. "తంత్రయోగ"మనే తాంత్రిక శాస్త్రం కూడా ఉన్నది.
1. భక్తి యోగం - ప్రేమ, దైవకృప కోసం భగవంతునితో అనుసంధానం కోసం మానవుని తపన భక్తియోగం.
2. కర్మయోగం - ఫలాపేక్ష రహితంగా స్వకర్మను ఆచరిస్తూ జీవించటమే కర్మయోగం.
3. జ్ఞానయోగం - వివేకం, విచారాలతో తన ఉనికిని గ్రహించటం, ఎరుకగల జీవన విధానమే జ్ఞానయోగం.
4. హఠయోగం - ఆసనములు ప్రాణాయామము ద్వారా శరీరాన్ని, మనసును సరైన స్థితిలో ఉంచి జీవన కాలాన్ని పెంపొందించటం హఠయోగం.
5. తంత్రయోగం - వివిధ మంత్ర, యంత్రాలతో శక్తి ఉపాసన మొదలైనవి యోగ ప్రక్రియలు ఆచరించి మహిమలు పొందగలగటం తంత్రయోగం.
6. రాజయోగం - శ్వాస నియంత్రణ, ఇంద్రియ నియంత్రణలతో, చిత్తవృత్తులనిరోధించటమే రాజయోగం. 'రాజయోగం' దీనిని యోగా అనే సామాన్య అర్థంలో ఉపయోగిస్తున్నారు. దీనినే అష్టాంగయోగ పద్ధతి అంటారు. పతంజలి మహర్షి యోగ సూత్రాల ద్వారా ఈ 'యోగ విద్య'ను మనకు అందించారు. మనిషి సిద్ధ పురుషులయ్యే ప్రక్రియలు చాలా శాస్త్రీయంగా, విపులీకరించాడు పతంజలి మహర్షి.
అష్టాంగ యోగ పద్ధతి: 1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 7. ధ్యాన, 8. సమాధి.
1. యమ:- ఇది ఐదు అంగాలు. 1. అహింస, 2. సత్య, 3. బ్రహ్మచర్య, 4. అపరిగ్రహ, 5. అస్తేయ(దొంగతనం చేయకుండా ఉండటం)
2. నియమ:- ఇవి కూడా ఐదు అంగాలు. 1. శౌచము, 2. సంతోషము, 3. తపస్సు, 4. స్వాధ్యాయనం, 5. ఈశ్వర ప్రణిధానము.
3. ఆసనము:- ఇందులో పలు రకాలైన ఆసనాలు కలవు. ఉదా: పద్మాసనం, హలాసనం, శీర్షాసనం, సూర్యనమస్కారాలు వంటివి.
4. ప్రాణాయామ:- శ్వాస నియంత్రణమే ప్రాణామాయ.(రచక, పూరక, కుంభక)
5. ప్రత్యాహార:- భౌతిక ఆకర్షణల నుంచి ఇంద్రియాలను నిగ్రహించటం.
6. ధారణ:- మనసును, శరీరంలో ఒక స్థానంలో కేంద్రీకరించటం.
7. ధ్యానం:- ధారణను నిరంతరాయంగా ఏకాగ్రతతో, జాగృతితో ఆచరించటమే ధ్యానం.
8. సమాధి:- ధ్యానంతో కూడా ప్రయాణించి, ఇంద్రియ జ్ఞానాలను, మనసును దాటి వెళ్లి దైవంతో అనుసంధానం పొందటమే సమాధి. ధారణ, ధ్యానం, సమాధి అనే ఈ చివరి మూడు ప్రక్రియలను కలిపి పతంజలి "సంయమనం" అని అన్నాడు. ఒక యోగి ఈ సంయమనాన్ని పొందినప్పుడు ఆ వ్యక్తికి మానవాతీత శక్తులు లభిస్తాయి. వీనిని పతంజలి ఇలా వివరించాడు.
1. భూత - భవిష్యత్ తెలుస్తుంది.
2. పక్షులు, జంతువుల భాష అవగతం అవుతుంది.
3. తన పూర్వజన్మలు తనకు తెలుస్తాయి.
4. ఇతరుల మనసులు చదవగలడు.
5. శరీరాన్ని మాయం చేయగలడు.
6. మరణాన్ని నియంత్రించగలడు.
7. సృష్టి రహస్యాలు తెలుసుకోగలడు.
8. ఆకలి, దప్పులను జయిస్తాడు.
9. నీటిని, అగ్నిని సృజించగలడు, మార్చగలడు.
10. దూరపు విషయాలు తెలుసుకోగలగటం వంటి శక్తి పొందగలడు(టెలీపతి).
11. భారరహిత శక్తిని పొందగలడు.
ఇలా దాదాపు 40 రకాల సిద్ధులు మనిషి యోగనిష్టితో పొందగలడు అని పతంజలి తన "యోగసూత్రాలలో" చెప్పాడు. భగవంతునితో అనుసంధానం కోసం "యోగసాధన" ప్రారంభించిన యోగి మధ్యలో లభించే ఇటువంటి "సిద్ధుల" ఆకర్షణకు లొంగితే పరిపూర్ణమైన, పవిత్రమైన అంతిమ సత్యాన్ని చేరుకోలేడు అని పతంజలి మానవాళిని హెచ్చరించాడు. మానవ శరీరంలో ఆరు "యోగచక్రాలు" ఉంటాయి. మనిషి వెన్నెముకను "మేరుదండము" అని అంటారు. ఇందులో "ఇడ, పింగళ, సుషుమ్న" అనే మూడు నాడులుంటాయి. ఇందులోని సుషుమ్న నాడి ఆరు చక్రాలను కలుపుతుంది. అవి: 1. మూలాధారము, 2. స్వాధిష్టాన, 3. మణిపూరక, 4. అనాహత, 5. విశుద్ధ, 6. ఆజ్ఞాచక్రం. శిరస్సులో 7వ చక్రం. "సహస్రార చక్రం" కూడా ఉంటుంది. మూలాధార చక్రంలో ఉన్న "కుండలిని"ని యోగవిధానంలో జాగృతం చేసి తలలోని సహస్రా పూరక చక్రంతో అనుసంధానం చేయటమే కుండలినీ యోగం.
*మూలాధార చక్రం - వెన్నెముక చివరన, మల ద్వారం దగ్గర ఉంటుంది.
*స్వాధిష్టానం - మర్మావయవాల వద్ద ఉంటుంది.
*మణిపూరక చక్రం - నాభి వద్ద ఉంటుంది.
*అనాహత చక్రం - హృదయంలో ఉంటుంది.
*విశుద్ధ చక్రం - కంఠంలో ఉంటుంది.
*ఆజ్ఞా చక్రం - రెండు కనుబొమల మధ్య ఉంటుంది.
*సహస్రార చక్రం - శిరస్సులో ఉంటుంది.
*ఇట్లు యోగరీతులు, యోగవిధానాలు ఎన్నో ఉన్నాయి. భారత జీవన విధానమే ఒక యోగమయం. దీనిని ప్రతి ఒక్కరు సక్రమంగా ఆచరిస్తే విశ్వశాంతి లభిస్తుంది. ఇంతటి మహోన్నత శాస్త్రాన్ని అందించిన ఆ ఋషి పుంగవులకు ఈ ప్రపంచం సర్వదా ఋణపడి ఉంటుంది.

Wednesday, February 4, 2015

జ్యోతిష్య శాస్త్రం

జ్యోతిష్య శాస్త్రం
జ్యోతిష్యం వేదంగాలలో ఒకటి. వేద పురుషునికి కన్ను వంటిది. అంటే వేదాలను అధ్యయనం చేసేటప్పుడు వేదంగామైన జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉండాలి. వేదకర్మలు నిర్వహించటానికి కాలం చాలా ముఖ్యమైనది. కాలానుగుణంగా యజ్ఞయాగాదులు నిర్వహించటం కోసం జ్యోతిష్య శాస్త్రం ఆవిర్భవించింది. "జ్యోతి" అంటే వెలుగు. జ్యోతిష్య శాస్త్రమంటే వెలుగును తెలిపే శాస్త్రం. కానీ ఈ శాస్త్ర విజ్ఞానమంతా నేడు భవిష్యత్తుని తెలుసుకొనే విద్యగా ప్రఖ్యాతి గాంచింది. జ్యోతిష్యశాస్త్రం ఒక అపురూపమైన విజ్ఞానం. అది నమ్మకం కాదు. భవిష్యత్తుని తెలపటం అందులో ఒక చిన్న భాగం మాత్రమే. ఆధునిక విజ్ఞానం గ్రహాల మధ్య ఉండే దూరాన్ని '"కాంతి సంవత్సరం"లో లెక్కిస్తుంది. కాంతిసంవత్సరం అంటే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం. ఒక నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంది అంటే దాని నుంచి మనకు ప్రసారమయ్యే కాంతి కనపడటానికి కొన్ని వందల, వేల కాంతి సంవత్సరాల కాలం పడుతుంది. అట్లాగే మన ప్రాచీన భారతీయులు కూడా సూర్యకాంతి ఆధారం చేసుకొని కాలగణన చేసి గ్రహ గతులను నిర్ణయించారు. అలాగే శుభ, అశుభ కాలాలను, ప్రకృతి వైపరీత్యాలను, గ్రహగతులతో అనుసంధానం చేసి మానవ జీవితాలపై అన్ని గ్రహాల ప్రభావాన్ని కనుగొన్నారు. అదే నేడు "జ్యోతిష్య శాస్త్రం"గా ప్రసిద్ధి చెందింది. వరాహమిహురుడు తన జ్యోతిష్యశాస్త్ర గ్రంథమైన "బృహత్ జాతక"లో మొదటి శ్లోకంలో "జ్యోతిష్యశాస్త్రం" సంసారమనే సముద్ర యానాన్ని దాటేందుకు "దిక్సూచి" వంటిది అని అంటాడు. దీనిని బట్టి జ్యోతిష్యశాస్త్రం కాలాన్ని తెలియజేసే మార్గదర్శి అని మనకు అర్థమవుతున్నది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులలో సంచరిస్తున్నపుడు మనిషిపై వాటి యొక్క భావాన్ని వివిధ కోణాల నుండి దర్శింపచేస్తుంది. మనిషి పుట్టిన స్థలాన్ని, కాలాన్ని అనుసరించి 'జన్మకుండలి'ని రచిస్తారు. ఆ జన్మ సమయంలో ఉండే గ్రహాల స్థితిగతుల ఆధారంగా మనిషి యొక్క జాతకాన్ని సూచిస్తారు. ఈ విజ్ఞానం అంతా కూడా ఎన్నో జ్యోతిష్య గ్రంథాలలో పొందపరచబడి ఉంది. ఇది ఒక మహాసముద్రం వంటిది. ఇందులో ప్రసిద్ధి గాంచినవి:
1. పరాశరుని - 'హోరశాస్త్రం'.
2. వరాహమిహురుని - 'బృహత్ జాతక'.
3. కళ్యాణ శర్మ - 'సారావళి'.
4. జైమినీ మహర్షి - 'జైమినీ సిద్ధాంతం'.
5. మంత్రేశ్వరుడు - 'జలదీపిక'.
6. భ్రుగు మహర్షి - 'భ్రుగు సంహిత'.
భారతీయ జ్యోతిష్య విజ్ఞానం ప్రతి శాస్త్రంలోనూ అనుసంధానింపబడి ఉంది. ఆయుర్వేదంలో కూడా 'రోగి' జన్మకుండలిని అనుసరించి వైద్యం చేసే విధానం ఉంది. గృహ నిర్మాణం, వ్యవసాయం, ప్రయాణం, యుద్ధాలు, వివాహాది సంస్కారాలలో, చివరకు దైనందిన కార్యక్రమాలలో తిథి, నక్షత్రం చూడకుండా పనులు ప్రారంభించనంతంగా ఈ శాస్త్రం భారత జనజీవనంలో మమేకమైనది. జ్యోతిష్యశాస్త్రం ఒట్టి బూటకమని, అది మనుషులను మోసం చేసే ప్రక్రియ అని, ఇది అసలు శాస్త్రం కాదనీ, కేవలం మూఢ నమ్మకం అనీ ఎందరో విమర్శకులు చెబుతున్నా ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్యశాస్త్రం ప్రాముఖ్యత తగ్గటం లేదు. ఆధునిక వైద్య శాస్త్రం కూడా అన్ని రోగాలకు నివారణ ఇవ్వదు. ఒక వైద్యుడు రోగం నయం చేసినట్టు మరో వైద్యుడు నయం చేయలేడు. ఒక వైద్య విధానం చెప్పిన దానిని మరో వైద్య విధానం వ్యతిరేకిస్తుతింది. అయినా వైద్యాన్ని విజ్ఞానం అంటాముకాని నమ్మకం అనం. అలాగే జ్యోతిష్యం విజ్ఞానమా? నమ్మకమా? అన్నది వాళ్ళ విచక్షణకే వదిలివేద్దాం. దీనిని ఉపయోగించుకొని ముందుగా పోయే వారిని ఎవరూ నిరోధించలేరు.
నాడీ జ్యోస్యం:-
మనయొక్క భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే తాళపత్ర గ్రంథాలు భారతదేశంలో కొన్ని కుటుంబాల వద్ద ఉన్నాయి. ఆ కుటుంబాలు వాటిని వంశ పరంపరగా, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి. "శివపార్వతుల" సంభాషణగా, సిద్ధులందించిన ఈ విజ్ఞాన నిధిని "నాడీ జ్యోతిష్యం" అంటారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని 'చిదంబరం' పట్టణానికి దగ్గర గల 'వైదీశ్వరన్ కోయిల్' అనే గ్రామంలో కొన్ని కుటుంబాల వద్ద ఈ తాళపత్రాలు ఉన్నాయి. ఈ తాళపత్రాలనే నాడీ పత్రాలు అంటారు. ఇప్పుడు మనకు లభిస్తున్న తాళపత్రాలు కొన్ని మాత్రమే. కనుక అందరి వృత్తాంతాలు ఈ నాడీ పత్రాలలో ఉండవు. కొన్ని తాళపత్ర గ్రంథాలను ఆనాటి తంజావూరు మహారాజు 'రెండవ షర్ఫోజి'వారు 'సరస్వతీ మహల్' గ్రంథాలయంలో ఉంచగా, వాటిని బ్రిటిషు వారు స్వాధీన పరుచుకొన్నట్టు తెలుస్తున్నది. బ్రిటిషు వారి నుంచి వాటిని సంపాదించి కొందరు విదేశీయులు వీటితో వ్యాపారం చేస్తున్నారు. ఈ నాడీ 'జోస్య' విధానం మొదట వ్యక్తి తన చేతి బొటన వేలిముద్ర ఇవ్వాలి. దీని ఆధారంగా నిపుణులు తాళపత్ర గ్రంథాలను పరిశీలించి ఆ వ్యక్తి వివరాలను తెలియజేస్తారు, అవి సరిపోలితే తదుపరి పరిశీలన ప్రారంభిస్తారు. ఆ లభించిన వారికి తండ్రి పేరు, తల్లి పేరుతో సహా పుత్రుల, భార్య పేరు తెలియజేయటం కూడా అబ్బురపరచే విషయం. ఇందులో కూడా నేడు కొందరు నకిలీ నాడిజోస్యులు ప్రవేశించి శాస్త్రాన్ని వ్యాపారపరంగా వాడుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రక్రియను కనుగొన్న సిద్ధులను, పరంపరగా దీనిని కాపాడుకుంటున్న కుటుంబాలను మనం అభినందించాలి. మన కృతజ్ఞతలు తెలియజేయాలి.

Tuesday, February 3, 2015

తెలుసుకోదగ్గ విషయాలు 2

తెలుసుకోదగ్గ విషయాలు 2
51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
54. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
55. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
56. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
62. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
64. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
66. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
71. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.
73. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
76. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
77. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.
78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
81. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
85. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
89. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
90. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
91. దిగంబరంగా నిద్రపోరాదు.
92. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
93. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
94. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
96. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
97. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
98. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
99. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
100. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి, లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.