ఎల్లరును బ్రాహ్మణులు కావలెను.
మొదట ఒక్క వర్ణమే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణము లెట్లేర్పడెను?
వర్ణ వ్యవస్థ యొక్క తత్త్వము తెలుసుకొననచో ప్రజలలో ఐక్యత యేర్పడి
ధర్మాచరణమునకు మంచి మార్గము కలుగును. ప్రధమములో పరమేశ్వరుడొక్క
బ్రాహ్మణులనే సృష్టించెను. బ్రాహ్మణులనగా బ్రహ్మనిష్టులు. కాని
కాలక్రయేణ వారియందు బ్రహ్మనిష్ట తగ్గుటయు, ఇతర కర్మలయందు వారికి
ఆసక్తికలుగుటయు తటస్థింపగా మిగతా వర్ణము లేర్పడినవి. ప్రధమములోని
ద్విజులే తామవలంభించిన కర్మల బట్టియు గుణముల బట్టియు క్షత్రియ,
వైశ్య, శూద్రులైరి. బ్రాహ్మణుడొక్కడే ఆదర్శపురుషుడు. బ్రాహ్మణ,
క్షత్రియ, వైశ్య, శూద్రులు తిరిగి తమ బ్రహ్మనిష్టను పెంచుకొని బ్రహ్మణులు
కావలసియున్నది. ఒక్క వర్ణము నుండియే మిగతా వర్ణము లేర్యడినట్లు
వేదమువల్లను మహభారతము వల్లను స్పష్టపడుచున్నది. 1. బృహదారణ్యక
ఉపనిషత్తు, 1 అధ్యాయము 4వ బ్రాహ్మణము 11 నుండి 15 కాండలు ఇచ్చట
మొట్టమొదట బ్రాహ్మణవర్ణ మొక్కటియే వుండెననియు, మిగతావర్ణములు దానిలో
నుండి సాంఘిక అవసరములనుబట్టి కలిగెననియు బ్రాహ్మణుని జీవితమే
యెల్లవారికిని ఆదర్శనమనియు స్పష్టముగ వర్ణింపబడి యున్నది. యీ
శ్రుతిభాగమునకు శంకరుడు వ్రాసిన భాష్యమునందు సయితము యిట్లే
వ్రాసియున్నాడు.
మహభారత శాంతిపర్వమునందు (186,187 అధ్యాయములు)
బృహదారణ్యక శ్రుతియందు కొంచము క్లిష్టముగా చెప్పబడిన యీ వర్ణవ్యవస్థ
బహుచక్కగా భృగుమహర్షిచే చెప్పబడినది. భృగుభరద్వాజులకు జరిగిన
సంవాదములో వర్ణరహస్యము చెప్పబడినది. భృగుభరద్వాజులు గొప్ప ఋషులు.
గోత్రకారులు. మనువుచే ధర్మముపదేశించుటకు ఆదేశింపబడిన వాడు భృగువు.
భరద్వాజుడు చాలకాలము వేదాభ్యాసమునందు గడపినాడు. వారికి వర్ణధర్మము
తెలియదని చెప్పనొప్పడు. వారిద్దరికిని జరిగిన సంవాదముయావత్తు
ప్రతివాడను చదివితీరవలయును.
"అసృజద్ర్బాహ్మణానేవ పూర్వం బ్రహ్మప్రజాపతేః
ఆత్మతేజోభినిర్వృత్తాన్ భాస్కరాగ్ని సమప్రభాన్".
"తతస్సత్యంచ ధర్మంచ తనో బ్రహ్మచశాశ్వతం
అచారం చైవ శౌ చంచ స్వర్గాయవిదధే ప్రభుః"
"నవి శేషోస్థివర్ణానాం సర్వంబ్రాహ్మ్యమిదంజగత్
బ్రాహ్మణాః పూర్వసృష్టంహికర్మభిర్వర్ణతాంగతమ్".
"కామభోగ ప్రియాసక్తాః క్రోధనాః ప్రియసాహసాః
త్యక్తస్వధర్మారక్తాంగా స్తేద్విజాః క్షత్రతాంగతా".
"గోభ్యోవృత్తిం సమాస్థాయపీతాః కృష్యుపజీవినః
స్వధర్మానానుతిష్టంతి తేద్విజా వైశ్యతాం గతాః"
"హింసానృత క్రియాలుబ్ధాః సర్వకర్మో పజీవినః
కృష్ణాః శౌచపరిభ్రష్టాస్తేద్విజాః శూద్రతాంగతాః"
"ఇత్యేతైః కర్మభిర్వ్యస్తా ద్విజవర్ణాం తరంగతాః
ధర్మోయజ్ఞ క్రియా తేషాం నిత్యం నప్రతిషిద్ధ్యతె".
"ఇత్యేతే చతురోదవర్ణా యేషాం బ్రాహ్మీసరస్వతీ
విహితా బ్రహ్మణా పూర్వం లోభాత్వజ్ఞానతాం గతాః"
"బ్రహ్మచైవ పరంసృష్టం యేనజానంతి తేద్విజాః
తేషాంబహు విధా స్త్యన్యాస్తత్ర తత్రహిజాతయః!
పిశాచారాక్షసా ప్రేతా వివిదామ్లేచ్ఛ జాతయః
ప్రనష్టజ్ఞాన విజ్ఞానాః స్వచ్ఛందాచారచోష్టితాః"
ఆధ్యాత్మితక సంపత్తిగల బ్రాహ్మణులచే మొదట సృష్టించెననియు, అప్పుడు
సత్యము, ధర్మము మొదలైనవి బాగుగానున్న వనియు, వారిలో కొందరు
కామభోగప్రియులై సాహస కార్యములబూని, స్వధర్మాచరణము మానినందున
క్షత్రియులైరనియు, మరికొందరు బ్రాహ్మణులు గోవుల పెంచుట, వ్యవసాయము
మొదలైన వృత్తుల నవలంభింపచుటచే వైశ్యులైరనియు, మరికొందరు
శౌచపరిభృష్టులై హింసావలంబకులై సర్వకర్మోపజీవు లైనందున వారు
శూద్రులైరనియు, యీ విధముగా వేరు వేరు వృత్తుల నవలంభించుటచే
బ్రాహ్మణులు వర్ణాంతరగుతు లైరనియు, యింకకొందరు స్వచ్ఛందాచారులై
మ్లేచ్ఛజాతులుగా యేర్పడి రనియు పై శ్లోకముల యొక్క భావమైయున్నది. ఈ
భావమునే అరణ్యపర్వములో యుధిష్టురుని గూర్చి వైశంపాయనుడు చెప్పియున్నాడు.
"నకులేన నజాత్యావాక్రియా భిర్బ్రాహ్మణోభవత్,
చండాలోపిహివృత్తస్థో బ్రాహ్మణస్సయుధిష్టర".
ఏకవర్ణ మిదంపూర్వం విశ్వమసీద్యుధిష్టిర
కర్మక్రియా విశేషేణ చాతుర్వర్ణ్యం ప్రతిష్టతం!!.
సర్వేవైయోని జామర్త్యాః సర్వేమూత్ర పురీషిణః
ఏకేంద్రియేంద్రియార్థ శ్చతస్మాచ్ఛీల గుణైర్ద్విజః!!
శూద్రోపి శీలసంపన్నో గుణవాన్ బ్రాహ్మణోభవేత్
బ్రాహ్మణోపి క్రియాహీనః శూద్రాత్ప్రత్యవరో భవేత్!!
నజాతిర్దృశ్యతేరాజన్గుణాః కళ్యాణ కారకాః
జీవితం యస్యధర్మార్ధం పరార్ధే యస్యజీవితం!!
అర్థము :- కులముచేతను పుట్టుకచేతను కాదు. కార్యములచేతనే
బ్రాహ్మణుడగును. మంచినడవడి కలవాడు చండాలుబైనను వాడే బ్రాహ్మణుడు.
పూర్వము యీ ప్రపంచము ఏక వర్ణముతో నిండియుండెను. కర్మక్రియా విశేషముచేత
చాతుర్వర్ణ్వము ప్రతిష్టింపబడినది. నరులందరు యోని నుండి పుట్టినారు.
అందరును మూత్ర పురీషములు కలవారు. ఏకవిధమైన యింద్రియములున్ను వాని
ప్రయోజరలములును గలవారు కాబట్టి సదాచార సద్గుణము చేత ద్విజుడగును.
శూద్రుడైనను సదాచార సంపన్నుడును, గుణవంతుడునునగువాడు బ్రాహ్మణుడు
అగును. బ్రాహ్మణుడైనను, క్రియాహీనుడు శూద్రుని కంటెను తక్కువవాడు.
జాతియందేమియులేదు. గుణములే కళ్యాణదాయకములు. ఎవనిజీవితము
ధర్మార్థమును పరోపకారార్ధమునగునో వాడే బ్రాహ్మణుడు.
సద్వృత్తియే ప్రధానము
భారత అనుశాసనిక పర్వములో ఉమామహేశ్వర సంవాదమందు మంచిపనులు చేయుటచేత
శూద్రుడు బ్రాహ్మణత్వమును పొందుననియు, వైశ్యుడు క్షత్రియత్వమును
పొందుననియు లోకములో బ్రాహ్మణత్వమంతయు సద్వృత్తి చేతనే కలుగుననియు,
సద్వృత్తియందున్న శూద్రుడు బ్రాహ్మణత్వము పొందుననియు స్పష్టముగ
జెప్పబడియున్నది.
"ఏభిస్తు కర్మభిర్ధేవి శుభైరా చరితైస్తథా
శూద్రో బ్రాహ్మణతాంయాతి వైశ్యః క్షత్రియతాం వృజేత్
సర్వోయం బ్రాహ్మణోలోకేవృతైన చవిధీయతే
వృతేస్థితస్తు శూద్రోపిబ్రాహ్మణత్వం నియచ్ఛతి"
మహమునియైన ఋశ్యశృంగుడు లేడికడుపున బుట్టియు వ్యాసుని తండ్రి మాలదానికి
బుట్టియు, వసిష్ఠ మహముని వేశ్యకు బుట్టియు, తపస్సు చేత
బ్రాహ్మణులైరనియు దీనికి కారణము సంస్కారమనియు వేదము ననుసరించి
భవిష్యత్పురాణము చెప్పుచున్నది.
"హరిణీగర్భసంభూతో ఋష్యశృంగో మహమునిః!
శ్వపాకీ గర్భసంభూతో పితామ్యనన్య సత్తమః!!
గణికా గర్భసంభూతో వసిష్ఠశ్చ మహమునిః!
తపసా బ్రాహ్మణోజాతః సంస్కారస్త్ర త్రకారణం"!!
వ్యాసుడు పల్లెదాని వలనను పరాశురుడు మాలదాని వల్లను బుట్టరనియు,
పూర్వము ద్విజులు కానివారనేకులు బ్రాహ్మణత్వమును పొందిరనియు భారతారణ్య
పర్వమునందున్నది.
జాతోవ్యాసస్తు కైవర్త్యాశ్శ్వ పాక్యాస్తుపరాశరః
బహవోన్యేసి విప్రత్వం ప్రాపయే పూర్వమద్విజాః
3. మహభారత వనపర్వమందు (180 అధ్యాయం) జన్మవలన బ్రాహ్మణుడు కాడనియు
వృత్తమే కారణమనియు దానిని బట్టియే వర్ణము నిర్ణయించ వలయుననియు
స్పష్టముగ చెప్పబడి యున్నది. ఇది సర్ప యుధిష్ఠిర సంవాద రూపకముగా
నున్నది. దానినిట వ్రాయుచున్నాను.
సర్పః :- బ్రాహ్మణః కోభవేద్రాజ వేద్యం కించయుధిష్టిర ( ఓ ధర్మరాజా బ్రాహ్మణుడన నెవ్వడు తెలిసినొనదగినదేది)
యుధిష్టిర :- సత్యందానం క్షమాశీలమానృశంస్యం తపోఘృణా దృశ్యంతే యత్రనాగేంద్ర సబ్రాహ్మణ ఇతిస్మృతః
(ఓ నగేంద్రుడా సత్యము, దానము, ఓర్పు, ఆచారము, అహింస తపము, దయ, యెవనియందుగలవో అట్టివాడు బ్రాహ్మణుడు.)
శూద్రేతు యద్భవేల్లక్ష ద్విజేతచ్చ నవిద్యతే
నవైశూద్రోభవేచ్చూద్రోబ్రాహ్మణోనచబ్రాహ్మణః
(పైన చెప్పిన గుణము లెవనికికలవో వాడు జాతి శూద్రుడయ్యును శూద్రుడుకాడు. ఎవనియందివిలేవో వాడు బ్రాహ్మణుడుయ్యును కాడు.)
యత్త్రెతల్లక్ష్యతే సర్ప వృత్తం సబ్రాహ్మణస్స్హృతః
యత్త్రెతన్నభవేత్సర్వం తంశూద్రమితినిర్దిశేత్
(ఓ సర్పమా యీ గుణము లెవ్వనియందు కాన్పించుచున్నవో వాడే బ్రాహ్మణుడని
యెన్నబడుచున్నడు. ఎవనియందీ గుణములులేవో వానిని శూద్రునిగా
భావించవలయును)
4.మహభారత అరణ్యపర్వము 312 అధ్యాయము 105, 106 శ్లోకములలో కూడ నీయర్ధయే చెప్పబడినది.
యక్ష :- రాజన్ కలేనవృత్తే నస్వాధ్యాయేన శ్రుతేనవా, బ్రాహ్మణ్యం కేనభవతి ప్రబ్రూహ్యేతత్సు నిశ్చితం.
యుధిష్టిర :- శ్రుణుయక్షకులంతాత నస్వాధ్యాయోన చశ్రుతం, కారణం వాద్విజత్వేచ వృత్త మేవనసంశయః
5.మహభారతము, వనపర్వము 108.
నయోనిర్నాపి సంస్కారో, నశ్రుతం నచసంతతిః
కారణానిద్విజత్వస్య, వృత్తి రే వతుకారణం
పుట్టుకవల్లగాని, సంస్కారములు చేయుట వల్లగాని వేదములు చదివినంత
మాత్రమునగాని పూర్వుల వల్లగాని బ్రాహ్మణు డనిపించు కొనడు.
నడతనుబట్టియే బ్రాహ్మణుడగునని మహభారతము వేదధర్మమునే
ఘోషిల్లుచున్నది.
6. మనుస్మృతియందు సయితము వేదధర్మావలంబి కాని
బ్రాహ్మణుడు శూద్రుడై పోవుననిము, అతడు కేవలము నామధారక
బ్రాహ్మణుడనియు చెప్పబడినది. అట్టివాడు కొయ్యయేనుగకును తోలులేడికిని
పోల్పబడినాడు. ద్విజుడు వేదము చదువక యితరత్రాశ్రమ చేసినచో
వాడీజన్మములోనే యావత్తు వంశముతో శూద్రత్వము పొందుననియు మనువు
చెప్పుచున్నాడు. (2 - 157, 168 )
బ్రాహ్మణుడు శూద్రుడు కావచ్చుననియు.
శూద్రుడు బ్రాహ్మణుడు కావలచ్చుననియు, క్షత్రయ వైశ్యుల యెడలను యీ
సూత్రమే వర్తించుననియు శుత్రి చెప్పినరీతినే, మనుస్మృతి
అంగీకరించుచున్నది. శూద్రో బ్రాహ్మణతామేతి, బ్రహ్మ వైశ్యౌన శూద్రతాం
క్షత్రియా జ్జాతమేవంతు విద్యుద్వైశ్వాత్తధైవచ. (10 - 65 )
జాతివలననే బ్రాహ్మణుడు కాడు
7. వజ్రసూచికోపనిషత్తు (సామవేదము) నందు యీ విషయము వివరింపబడి
యిదయే శ్రుతి స్మృతి పురాణేతిహసముల అభిప్రాయమనికూడా
సృష్టపరుపబడినది.
"తర్హిజాతిర్బ్రాహ్మణ ఇతి చేత్తన్న
తత్రజాత్యస్తరేష్వనేక జాతిసంభవాత్ మహర్షయో బహవస్సన్తి, ఋష్యశృంగో
మృగ్యాచ కౌశికః కుశాత్, జాంబూకో జంబుకాత్, వాల్మీకో వల్మీకాత్, వ్యాసః
కైవర్తకన్యాయాం, శశపృష్ఠాగ్గౌతమః వసిష్ఠ ఊర్వశ్యాం, అగస్త్యః
కలశేజాత ఇతి శ్రుతిత్వాత్, ఏతేషాం జాత్యావి నాప్యగ్రేజ్ఞాన ప్రతిపాదితా
ఋషయో బహవస్సన్తి తస్మాన్ నజాతిర్ర్బాహ్మణ ఇతి.
తాత్పర్యము
వర్ణము బ్రాహ్మణుడనిన యెడలన అదియు కాదు. ఒక వర్ణములోనే అనేక వర్ణములు
కలుగుచుండుట వలనను, అనేకులు మహర్షులు ఋష్యశృంగుడు లేడివలనను,
కౌశికుడు దర్భవలనను, జాంబూకుడు నక్కవలనను, వాల్మీకుడు
పుట్టవలనను, వ్యాసుడు చండాల స్త్రీయందును, గౌతముడు కుందేటివీపునను,
వసిష్టుడూర్వశివలనను, అగస్త్యుడు కుండయందును పుట్టినట్టు
తెలియుచుండుటవలనను, వీరిలో జాతిలేకయు జ్ఞానము కలుగజేయు ఋషులు
అనేకులుండుట చేతను వర్ణము బ్రాహ్మణుడనకూడదు.
వేదము కొన్ని
లక్షణములను చెప్పి్ప ఆ లక్షణములు కలవాడు బ్రాహ్మణుడనియు- "ఇతి
శ్రుతి స్మృతి పురాణేతిహసానామభిప్రాయః అన్యధా
బ్రాహ్మణత్వసిద్ధిర్నాస్త్యేవ" - అని ఖండితముగా పలుకుచున్నది.
వర్ణము - గీత
శ్రీ భగవద్గీతయందు నాలుగు వర్ణములు పరమేశ్వరునిచే సృజింప
బడెననియు, గుణకర్మముల బట్టి వర్ణ నిర్ణయము తప్పనియు నున్నటుల
కొందరు వాదించుట మనము వినుచున్నాము. ఇది కేవలము పొరపాటు.
"చాతుర్వర్ణ్యం మయాసృష్టం, గుణకర్మవిభాగశః
తస్యకర్తార మపిమాం, విధ్యకర్తారమవ్యయం"
ఈ కాలమందు వర్ణము తల్లిదండ్రులను బట్టి నిర్ణయించున్నాము.
శ్రీకృష్టుడు వర్ణమును దేనినిబట్టి నిర్ణయించెను? "గుణకర్మవిభాగశః".
గుణములను బట్టియు, కర్మను బట్టియు నిర్ణయించెను.
భగవంతుడు
వర్ణములను సృష్టింప లేదనియు, మానవులే వారివారి గుణములను బట్టియు,
అవలంభించిన వృత్తులను బట్టియు వర్ణములు సృష్టించికొనిరనియు ఈ
శ్లోకమునందే కలదు. "విథ్యకర్తారం" అనుపదములలో యావత్తు అర్ధము
యిమిడియున్నది. మనము బుద్ధిననుసరించి తెచ్చుకొనినవీ వర్ణములు.
భగవంతుడు కేవలము నిమిత్త మాత్రుడు. ఆయన లేనిది సృష్టిలేదు గనుక నేను
చేసినదని చెప్పుట తటస్థించినది.
"స్వధర్మే నిధనం శ్రేయః" (గీ.
3-35) అని చెప్పుటలో జాత్యతః వర్ణములను శ్రీ కృష్టుడు చెప్పనని కొందరి
వాదన. ఇదియును సత్యమునకు దూరము. స్వధర్మమనగా స్వభావనియతంకర్మ
యని వేరొకచోట గీతలో చెప్పబడిన ధర్మయే.
అయితే ఒక వర్ణము వారియింట
మరియొక వర్ణము వారు భుజియింప వలయునని గాని, అంతర్వివాహదులు
చేసికొనవచ్చునని గాని నేను చెప్పుటలేదు. చదువరులు విపరీతార్ధమును
చేసికొనకుందురు గాక.
సాంఘిక జీవనము యొక్క పవిత్రత, శౌచము కొరకు
అట్టివికూడవనియే నా అభిప్రాయము. ఆధ్యాత్మిక జీవనము పెంపు చేసికొని
బ్రహ్మనిష్టులగుటయే మదీయాశయము.
జాతి వ్యవహర కల్పితము
శుక్లయజుర్వేదగత నిరాలంబొపనిషత్తునందు జాతియనునది వట్టి
భ్రమయనియు లోకములో వ్యవహరముసాగగలందులకు కల్పితమనియు
చెప్పబడినది.
నచర్మణోనరక్తస్య, నమాంసస్యనచాస్థినః
నజాతిరాత్మనో, జాతిర్వ్యవహర ప్రకల్పితః
తా!! జాతిదేహము మీద నుండు చర్మమునకులేదు. రక్తమునకులేదు, మాంసమునకు
లేదు. ఎముకకు లేదు. ఆత్మకు లేదు. జాతియనునది వ్యవహరము నిమిత్తము
కల్పింపబడియున్నది. లోకము నడచుటకు క్షత్రియ వైశ్య శూద్రు
లవలంభించు కర్మలవసరమగుటచే ఎవరు చేయుకర్మను బట్టి వారికి
ఆవర్ణము పేరు పెట్టినారు. "కర్మభిర్ వర్ణతాంగతః" అని భృగుమహర్షి
చెప్పినదియే యధార్ధము.
పురుషనూక్త మంత్ర వివరణము
1. కొందరు
ఋగ్వేదములోని పురుషసూక్త భాగమందలి బ్రాహ్మణోస్యముఖమాసీత్
!బాహూరాజన్యఃకృతః, ఊరూతదస్యయద్వైశ్య ! పద్భ్యాంశూద్రో అజాయత !! అను
మంత్రము వల్ల నాల్గువర్ణములును బ్రహ్మనుండి పుట్టినవని లేని అర్ధము
చెప్పుచున్నారు. ఆ మంత్రము ఎందులకు చెప్పబడినదో, దాని విశాల భావమేమో
వారు యోచింపక పైకి కనుపడురీతినైనను గమనింపక విపరీతార్థమును
చెప్పుచున్నారు.
ఆమంత్రలు ఒక అలంకారమని ముందు గుర్తెరుగ వలయును.
ఆమంత్రము గొప్ప సిద్ధాంతములను సూచించుచున్నది. మానవకోటి యావత్తును
భగవంతుని సంతానమని మొదటి సిద్ధాంతము. మానవులలో వారివారి
గుణకర్మలను బట్టి మార్పులున్నవనియు, వారువారు పనులను శరీరమునకు
ఆయా అవయవములు యేలాగున వేరువేరు పనినిచేసి నిలుపుచున్నచో, భగవంతుని
సృష్టిలో లోకసంగ్రహవు జరుగుటకు అనగా స్వార్థపరత్వముతో తమ మంచి
కేకాక లోకము యావత్తు బాడుపడగలందులకు చేయవలయునని రెండవ
సిద్ధాంతము. సృష్టియావత్తును పరమేశ్వరుని స్వరూపమే యనునది మూడవ
సిద్ధాంతము.
ఋగ్వేదములోని పురుషసూక్త భాగము నిటకొంత చర్చింతము.
మంత్రార్ధము లోగడనే తెలుపబడెను. పాదమువలన శూద్రుడు పుట్టెను అను
వాక్యమునుబట్టి బ్రాహ్మణాదులు తత్తదవయవములనుండి పుట్టిరని కొందరు
సాంప్రదాయకులు వాదింపబూనిరి. కాని సూక్తములలోని 11వ మంత్రములోని
ప్రశ్నలకు 12వ మంత్రము ఉత్తరునని వారు గమనింపరైరి. యత్పురుషం
వ్యదధాః ! కధితావ్యకల్పయన్, ముఖంకిమస్య కౌబాహూ ! కావూరూపాదావ్రచ్యేతే
!!
(దేవతలు) పురుషుని కల్పించిప్పుడు, ఎన్ని విధములుగా
కల్పించిరి అతనికి ముఖమేది బాహూవులేవి ఊరువులేవి పాదములేవి (అని పలుక
బడుచున్నవి.)
2. ఇంతేకాక పురుషసూక్త మందు వర్ణింపబడిన పురుష
యజ్ఞాదికము యావత్తు మానసికమే యైయున్నది. లేనిచో విపరీతార్ధము
తటస్థించును. వాచ్యార్ధమును గైకొనినచో ఛాందసులనియే చెప్పవలసి
వచ్చును. 6 వ మంత్రమును చూడుడు.
"యత్పురుషేణహవిషా దేవాయజ్ఞమతన్వత,
వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మఇధ్మశ్శరద్ధవిః"
(పురుషుడను హవిస్సుతో దేవతను యజ్ఞము చేసినప్పుడు దానికి వసంతఋతువు
నెయ్యియు, గ్రీష్మఋతువు సమిధయు, శరదృతువు హవిస్సును అయ్యెను.) ఇందలి
యజ్ఞము హొమద్రవ్యములు కేవలము మానసికమని చెప్పమలయును గాని
పైనకనపడురీతిని అర్ధము చెప్పనగునా?
3. పురుష సూక్తములోని మొదటి మంత్రమునకైనను వాచ్యార్ధము చెప్ప నెవ్వడు సాహసించును?.
"సహస్రశీర్షాపురుషః సమస్రాక్షస్సహస్రపాత్
సభూమిం విశ్వతోవృత్వా అత్యతిష్ఠదశాంగులం"
(పురుషుడు వేయిశిరస్సులు కలవాడు, వేయికన్నులు గలవాడు. వేయిపాదములు
గలవాడు. భూమినంతట ఆవరించి పది అంగుళములు మించినిలుచును.)
ఇంతవరుకు ఓపికగా చదివిన వాళ్ళు ఇంకా తెలుసుకోవాలంటే
http://www.syamasahithi.com/vedicreligion ని సంప్రదించండి.