Wednesday, February 12, 2014

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు



తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు

తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో

మూలమూర్తి (ధ్రువబేరం)
నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)
ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు. ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.

ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)
ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)
13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.

కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)
గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు

సేకరణ ఇచట నుండి

తెలుగు నెలలు


తెలుగు నెలలు (తెలుగు మాసములు) :

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.

ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).


తెలుగు నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జ్యేష్ఠము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వయుజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము


ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

* పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
* పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
* పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
* పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
* పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
* పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
* పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
* పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
* పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
* పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
* పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
* పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.

ఇచట నుండి సేకరణ

తేజోమహాలయం


యమునా నదీ తీరాన, రంగు రంగుపూలతో నిండిన పచ్చటి పచ్చికబయళ్ళమధ్య ఠీవిగా నిలుచున్న ప్రపంచవింత తాజ్ మహల్ గా పిలవబడ్డ తేజోమహాలయం.
నాటి రాజపుత్రుల రాజసానికి చిహ్నంగా, మేటి భారతీయ శిల్పకారుల స్వప్న సాక్షాత్కారం తేజో మహాలయ. ఆదిదేవుడైన ఆ రుద్రుని తేజస్సుకు ప్రతిరూపం ఈ చలువరాతి మందిరం. నేడు ప్రేమికులకు ప్రేమ చిహ్నంగా నిలిచి, జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకొనే భవ్య మందిరం తేహోమహాలయం.
మధ్యలో శివుడు, ఆయన చుట్టూ దేవీ దేవతల మందిరాలు, వాటిచుట్టూ ఆవాసయోగ్యమైన గదులు, రహస్య మర్గాలు, యమునలోకి వెళ్ళే సోపాన మార్గాలు, మందిరపు పై కప్పులో ఉన్న సూర్యతేజస్సును తెలిపే సూర్యకిరణాల అల్లిబిల్లి అల్లికలు, లేసులను తలపించే మందిర గవాక్షాలు, ఆర్చీలుగా అమర్చబడ్డ జంటస్వరాల తోరణాలు, గోడలనిండా అందంగా చెక్కబడ్డ శంఖుపుష్పాలు, ఉమ్మెత్త పువ్వుల మధ్యలో అందంగా అమరిన ఓంకారం, తామరల మధ్య విలసిల్లిన త్రిశూలం, మందిరపు గుమ్మటంపై ఆకాశంలోకి చూస్తున్న అష్టధాతువులతో నిర్మించబడ్డ శశిరేఖ దాని మధ్యలో పూర్ణకలశం, దానిపై కొబ్బరికాయ.
రాజపుత్ర రాజు రాజా మాన్ సింగ్ ఎన్నో కట్టడాలకు తలమానికంగా నిలిచిన మందిరం తాజ్ మహల్.
వారసత్వంగా తరువాతి కాలంలో (సా.శ.1628-1658) ఈమందిరం ఆక్రమణకు గురై తరువాత మసీదు చేయబడింది.
మొగలుల పరిపాలనా కాలంలో ఎన్నో దేవాలయాలు కూల్చబడి, లేదా మార్చబడి మసీదులయ్యాయి. అలా ఒక అద్భుత రాజమందిరం, ఒక మహాదేవాలయం కూడా కుసంస్కారులైన చరిత్రకారుల చేతుల్లోబడి, హైందవదేవాలయం కాస్తా, తాజ్ మహల్ గా, మసీదుగా మారిపోయింది.
ప్రపంచ చరిత్రలో, Encyclopedia Britanica Americanaలో కూడా తాజ్ మహల్ షాజహాన్ చే కట్టబడిందని వ్రాయబడింది.
చరిత్రలో మొట్టమొదటి సారిగా జె.బి.టావెర్నియర్ అనే ఫ్రెంచి వ్యాపారవేత్త తన పుస్తకం "Travels in India" లో ఈ విధంగా వ్రాశాడు.
షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం 20,000 మంది కూలీలతో 22 సంవత్సరాలు కష్టపడి కట్టించిన అద్భుత సౌధం తాజ్ మహల్" అని వ్రాశారు.
టావెర్నియర్ భారతదేశాన్ని సా.శ.1638-1668 సంవత్సరాల మధ్యకాలంలో ఆరుసార్లు సందర్శించారు. ఇందులో అతను రెండుసార్లే (సా.శ.1640-41, 1665) ఆగ్రాని సందర్శించారు.
చారిత్రకంగా ముంటాజ్ సా.శ.1631లో చనిపోయినట్లుగా ఉంది. అంటే టావెర్నియర్ ముంతాజ్ చనిపోయిన పది సంవత్సరాలకి ఆగ్రాకి వస్తే అప్పటికి తాజ్ నిర్మాణం పూర్తికాకూడదు.
కాని అది పూర్తి కట్టడమని రాశారు. అంటే షాజహాన్ కంటే ముందే అక్కడా భవ్యమందిరం ఉందన్నమాట.
షాజహాన్ ఆస్థానంలోని లేఖకుడు ముల్లాఅబ్దుల్ హమీద్ లహరీ వ్రాసిన "బాద్ షా నామా" గ్రంథంలో అసలు తాజ్ ప్రసక్తి లేదు. మరి షాజహాన్ అంత ప్రతిష్ఠాత్మకంగా తాజ్ ని నిర్మించి ఉంటే దానికైన ఖర్చు గురించి, కూలీల గురించి తప్పని సరిగా రాసి ఉండాలి కదా! కానీ అందులోని 402, 403 పుటల్లో వివరణ ఇలా ఉంది - "చనిపోయిన ముంతాజ్ మహల్ శరీరాన్ని ఆగ్రాకు తీసుకువచ్చి, రాజా మాన్ సింగ్ యొక్క భవనంలో ఉంచబడింది."
Friday 15th Jamadiulawal the sacred dead body of the traveller to the Kingdom of holiness Hazrat Mumtazul Aamani, who was temporarily buried was brought to the Capital Akhara bad(Agra) and an order was issued that veryday Coins be distributed among the beggers and Fakirs. The site covered with a majestic garden, to the south of Agram, and admidst which the building known as the Palace of Raja Mansingh, at Present owned by Raja JaiSingh was selected for the burial of the Queen, whose abode is in heaven. (Bad-Shah-nama).
అంటే రాజా జైసింగ్ నుంచి షాజహాన్ తాజ్ మహల్ గా పిలువబడే భవ్యమైన మందిరాన్ని తీసుకున్నాడు లేదా ఆక్రమించుకున్నాడు.
షాజహాన్ ఈ మందిరాన్నే ఎందుకు ఎంచుకున్నాడంటే తేజోమహాలయలోని శివుని గర్భగుడి ప్రాంతం బంగారంతోను, గోడల్లో వెలుతుతు కోసం వజ్రాలు, పచ్చలు, రంగురాళ్ళు పొదగబడి ఉన్నాయి. కనుక ఆ మందిరాన్ని తన భార్య సమాధికోసం ఎంచుకున్నాడు.
షాజహాన్ తన భార్య ముంతాజ్ ను మరువలేక, తన ప్రేమకు చిహ్నంగా దీన్ని నిర్మించాడని చరిత్రలో రాశారు. కానీ ముంతాజ్ అని పిలువబడే అర్జుమంద్ భానును, షాజహాన్ సా.శ.1612లో వివాహం చేసుకున్నాడు. ముంతాజ్ సా.శ.1630 లేదా 1631లో చనిపోయింది.
వారి 18సంవత్సరాల కాపురంలో ఆమె 14మంది బిడ్డలకు జన్మనిచ్చింది. 14వ బిడ్డకు జన్మనిస్తూనే కన్నుమూసింది. షాజహాన్ జమానాలో వందలమంది స్త్రీలలో ముంతాజ్ ఒకరు. అంతేకానీ, ఆమెమీద షాజహాన్ కు అంత ప్రేమలేదనుకోవచ్చు. ముంతాజ్ చనిపోయినప్పుడు ఆమె ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఖుర్హాన్ పూర్ లోని మందిరంలో ఉంది.
ఆమెను ఆ భవన సముదాయంలోని ఒక చిన్న భవనంలో ఖననం చేశారు. ఆ తరువాత సంవత్సరం ఆమె శరీరాన్ని ఆగ్రాకు తరలించి, నేడు తాజ్ మహల్ అని పిలువబడే ప్రాంతంలో ఉంచారు. మరి షాజహాన్ 22సంవత్సరాలు కష్టపడి తాజ్ ని కట్టాడన్నది అబద్ధమే కదా!
సా.శ.1652లో ఔరంగజేబు తన తండ్రికి ఒక లేఖను రాశాడు. ఇందులో మాన్ సింగ్ భవనంలోని రెండవ అంతస్తులోని గదులలో నీరు కారుతోందని, అలాగే పైన ఉన్న గుమ్మటం పగుళ్ళిస్తోందని వాటికి మరమ్మత్తులు చేయించాలని వ్రాశాడు. (ఈ ఉత్తరం "ఆదాబ్-ఈ-అలంగీ", యాద్ గార్ నామా" గ్రంథాలలో లభ్యం).
ముంతాజ్ సా.శ.1631లో చనిపోయి, షాజహాన్ 22సంవత్సరాలు తాజ్ మహల్ కట్టుంటే సా.శ.1653లో అది పూర్తి కావించబడాలి. సా.శ.1652లోనే దానికి మరమ్మత్తులు చేశారంటే అది అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిర్మించబడి ఉండాలి.
భారత పురావస్తు శాఖవారు 1982లో ఒక చిన్న పుస్తకం "Taj Museum" - అని విడుదల చేశారు. అందులో - "Mumtaz died in Burhanpur and was buried there. Six months later Shahjahan exhumed her body and sent her Coffin to Agra, an tha site Until then stood Late Raja Mansingh's Palace ......."
అంటే తాజ్ మహల్ ని షాజహాన్ కట్టలేదన్నది వాస్తవం. అయినా సరే భారతప్రభుత్వం, NCERT, SCERT చరిత్ర పుస్తకాలన్నింటిలో షాజహాన్ తాజ్ మహల్ కట్టించెను అని రాసినదాని చెరిపేసి, అది మాన్ సింగ్ భవనమని, దానిపేరు "తేజోమహాలయ" అని రాయరు ఎందువల్ల?
సా.శ.1905 సంవత్సరం వరకు ఆగ్రా గజెట్ లో రాజా మాన్ సింగ్ భవనంగా ఉన్న తాజ్ మహల్, 1905లో లార్డ్ కర్జన్ హయాంలో షాజహాన్ నిర్మించినట్లుగా మసిపూసి మారేడుకాయ చేశాడు.
కారణం హిందూ, ముస్లింలను చీల్చటానికే. నాటినుంచి నేటివరకు ఆ తప్పు సరిదిద్దబడలేదు.
ఇప్పటికీ తాజ్ మహల్ లోని క్రింది అంతస్తులోని 22 గదులు సీలు వేయబడి సందర్శకులకు అనుమతి లేకుండా ఉన్నాయి. షాజహాన్, ముంతాజ్ సమాధుల చుట్టూ ఉన్న షట్చక్రాకార తెరలు తరువాత చుట్టూ ఉన్న గదులన్నీ ఇటుకలతో మూసివేయబడ్డాయి. అలాగే రహస్యమార్గాలు, యమునలోకి ఉన్న సోపానమార్గాలు, అదే ఆవరణలో ఏడంతస్తుల లోతులో ఉన్న బావి, దానిచుట్టూ చల్లగా ఉండే గదులు, తాజ్ చుట్టూ ఉన్న నౌకలకు లంగరు వేసే రింగులు, ఉద్యానవనంలో ఉన్న శిఖరం యొక్క నీడ ఇవన్నీ కూడా తాజ్మహల్ సమాధికోసం కట్టినది కాదని, అదొక ఆలయమని చెప్తాయి.
తాజ్ కి రెండువైపులా ఉన్న వంటశాల, వాయిద్యాలను దాచే మందిరం అది ఆలయమేనని ఋజువు చేస్తున్నాయి. ఇప్పటికీ సమాధిని దర్శించే సందర్శకులు చెప్పులు విడిచి లోపలికి వెళ్ళడం ఆనవాయితీ.
ఒకవేళ నిజంగా అది ముంతాజ్ కోసం నిర్మించిన సమాధి అయితే ఇవన్నీ అనవసరం కదా!
ఇటుకలను అడ్డుపెట్టి మూసేసిన గదులను మళ్ళీ తెరిస్తే, తాజ్ కి సంబంధించిన చాలా వాస్తవాలు తెలుసుకుంటే, బహుశా భారతదేశ చరిత్ర మరోవిధంగా వ్రాసుకోవచ్చునేమో!
ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజలు ఇలాంటి నిజాల్ని తెలుసుకొని, అసలైన భారతదేశ చరిత్రను ముందుతరాలకు అందించాలని, ’కాలగర్భం’లో కలిసిన తేజోమహాలయం మళ్ళీ పునరుద్ధరించబడాలని కోరుకుందాం.

ఇచట నుండి సేకరణ

Monday, February 10, 2014

కవిత్వం-చెరుకు రామమోహనరావు గారు

kavitvaM by Sri Cheruku Ramamohanrao garu
అద్భుతమైన వ్యాసం. నిజమే కవితకు అనర్హమైనది ఏదీలేదు. ఐతే అందరూ మాత్రం కవులు కాలేరు. ఎదో పదాలు వ్రాసేసి అడ్డదిడ్డంగా విరిచేసి, పదాలగారడి చెయ్యటం కవిత్వం కాదు. నాదృష్టిలో కవిత్వం అంటే చదివినవారికి కవిహృదయం అర్ధం కావాలి. తను ఏమి చెప్పదలచుకున్నాడో అది స్పష్టంగా చెప్పగలగాలి. మనసుని ఉర్రూతలూగించ గలగాలి, ఉత్తేజపరచగలగాలి, ఆలోచింపచేయగలగాలి, భావోద్రేకాలని వెలికితేగలగాలి. అప్పుడే అది నిజమైన కవిత్వం అనిపించుకుంటుంది. అసలైన కవిత్వం అనిపించుకుంతుంది. ఆనాటి మన ప్రాచీన మహాకవులు ఇదే ధోరణిలో తమ కవితావ్యాసంగం చేసి మహాకావ్యాలను సృష్టించారు. నవతరంకవులలో ఎంతోమంది ఇదే స్పూర్తితొ ఎన్నో రచనలు సాగించారు. కానీ నేడు కొంతమంది కవితల పేరుతో చేతికివచ్చినది వ్రాసి కవులుగా వెలుగుతున్న సంగతి తెలిసినదే. అటువంటివారికి ఈ వ్యాసం ఒక కనువిప్పు. ఈసందర్భంలో నాకు ఒక విషయం గుర్తు వస్తున్నది. ఆనాటికాలం నుండి కుకవులు ఉండేవారని కావ్యాలలోనే తెలుస్తుంది. అదేవిధంగా ఈనాటి కాలంలో శ్రీవేటూరి సుందరరామమూర్తిగారు (వీరు శ్రీవేటూరిప్రభాకరశాస్త్రిగారి మేనల్లుడు)ఒక టి.వి. లోమాట్లాడుతూ "ఆరేసుకోబోయి" వంటిపాటలు పొట్టకూటికోసం వ్రాయవలసి వచ్చిందని ఎంతో సిగ్గుపడుతు చెప్పారు. ఎంతో గొప్ప మహాపండితుడిని మన సినిమా ప్రపంచం సినీగీత రచయితగా మార్చేసింది. పరిస్థితుల ప్రభావం అనండి, ఇంకేమైన అనండి ఇది మారుతున్న మన అభిరుచులకు అద్దం పడుతోంది.

Sharing the interesting article by SrI. Cheruku Ramamohanrao garu.

కవిత్వం

'కాదేదీ కవిత కనర్హం' అని అభ్యుదయ కవిత్వమున అగ్రగణ్యుడైన మహా కవి శ్రీశ్రీ ఏ ఆలోచనతో ఏ ముహూర్తమున అన్నారో కానీ నేడు ఆ మాట అక్షర సత్యము. వారు ఆమాట అనకుండా వుండియుంటే నాలాంటివారు పలువిధములైన ఉత్త,చెత్త,లోత్త కవితలు ప్రచురించే ధైర్యము చేసియుండేవారు కాదేమో. వారు ఏ కవితా వస్తువునైనా రసమయము చేసి రసనపై రాసలీల జరిపించగల దిట్ట. నా లాంటి వారికి ఆయనతో సామ్యమెట్ట. వారి కవితలలో కథావస్తువు క్రొత్తదైనా అందులో పరిశీలన,రసము,శయ్య, భావము, అలంకారము, అనుప్రాసము, పాండితీ ధిషణ అడుగడుగునా అణువణువునా కనిపించుతుంది. మరి నాలాంటి వారిలోనో? వారికన్నా ఒక అడుగు ముందుకు వేసిన 'దేవరకొండ బాల గంగాధర తిలక్, గారి కవితలు వచన కవితలేయైనా రసపుష్టి కలిగినవని పండితులు పదేపదే చెబుతూ వుంటారు. మరి నాలాంటి వారిలో అది ఎక్కడ.

నన్నయ, తిక్కన ఆదిగా గల కవులందరూ వాల్మీకి,వ్యాస,కాళిదాసాది మహా కవులకు మ్రొక్కక తమ రచనలు ప్రారంభిచలేదు. వారి తదుపరి వచ్చిన తెలుగు కవులు అటు సంస్కృత కవులను ఇటు నన్నయాది కవులను మనసారా తలంచక తమ కవిత్వ మహత్వ పటుత్వ సంపదలను మనకు పంచి పెట్టలేదు. మరి నాలాంటి వారికో అవి తలచే అర్హత కూడా మృగ్యమే! మరియా అనర్ఘ సంపద ఏమికావలె? చెదపురుగుల కాహారమేనా ! ఒకానొక కాలములో కవిత్వము వ్రాయుటకు భయముగా వుండేది, గురువుల ఎదుట సిగరెట్టూ అంటించనట్లు . మరినేడో గురువు శిష్యుడు కలిసే కానిస్తున్నారు. శ్రీనాథుడు ఒక సందర్భములో అంటాడు :

బూడిద బుంగలై యొడలు పోడిమి తగ్గి మొగంబు తెల్లనై
వాడల వాడాలన్ దిరిగి వారును వీరును చొచ్చొచో యనన్
గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు కొండవీటిలో
'గాడిద'నీవునున్ కావివి కావుకదా యనుమాన మయ్యెడిన్

అని అనగలిగినాడు. మరి వాక్స్వాతంత్ర్యము , భావ స్వాతంత్ర్యము ,వ్యక్తీ స్వాతంత్ర్యము కలిగిని మనలను నేడు అనగలడా!
అల్లసాని పెద్దన యంతటి వాడిని
'ఉమ్మెతక్కయ తిని సెపితో
క్రమమెరుగక ఎర్రి పుచ్చ కయ డిని సెపితో
ఎమి తిని సెపితో కపితము
అమవస నిసి యనుచు నువ్వు అలసని పెదనా

యని ధిక్కరించినాడు తెనాలి రామకృష్ణుడు. మరి నేడో?

ఇదే తెనాలి రామకృష్ణుడు ప్రెగ్గడ నరసరాయలన్న కవి, పెద్దలైన 'పెద్దన' లాంటి వారిని నిరసించితే 'భావ్య మెరుంగక పెద్దలైన వారల నిరసింతువాప్రగడరాణ్ణరసా విరసా తుసా భుసా' చూచినారా నవ్వులాట వేరు గౌరవ మర్యాదలు వేరు. ఇప్పటి కవితలలో ఇంతటి నిర్దుష్ఠత కనగలమా! ఏ దిగంబర కవులలోనో నగ్న కవులలోనో విప్లవ కవులలోను కనగలమంటే, వారి కవితలనేమాత్రము మనము గుర్తుంచుకో గలిగినాము. వేటూరి, సీతారామ శాస్త్రి లాంటి సినిమా కవుల గీత రచనలలోని పదములు అన్నీ తెలియక పోయినా వింటూ ఎంతనో అనందించుతాము.
ఇది ,భాష గొప్పదనము అన్న పుష్పమునకు, వారి భావము, పదముల కూర్పు, అన్న రంగు సువాసన కూర్చినట్లైనది కదా! పింగళి నాగేంద్రరావు గారు సినిమాలకు మాటలు పాటలు వ్రాసే కాలములోఎన్నోతెలుగు పదాలు తేర మీదికి తెచ్చినారు . అందులో 'హల' అన్న పదము ఒకటి. జగదేకవీరుని కథలోని 'జలకాలాటలలో'అన్న పాటలో 'ఏమి హాయిలే హల' అన్న ప్రయోగము ఆపాటను ఎంత ప్రసిద్ధి చెంద జేసిందో
ఆతరము వారికెవరికైనా ఇప్పటికీ మరచి పోలేని విషయమే. అది కవిత్వమంటే.

మాకు ముందు తరములోని పెద్దలు వాడుక భాష పేరుతో పర్వత శిఖరాగ్రమున వుండే భాషకు పతన మార్గము చూపించి చరిత్రలో మార్పుకు మార్గదర్శకులుగా, భాషను అప్రతిష్ఠ పాలు చేసినా, తమ ప్రతిష్ఠను పదిలం చేసుకొన్నారు. భాష మీద పట్టులేకుండా కవితలలో భావ ప్రకటన సాద్యమా.కవిత తమలపాకు లాంటిది. దానికి తడి తగులుతూ ఉంటేనే తన పచ్చదనమును కోలుపోక తాంబూలమునకు రాసిక్యత చేకూర్చుతుంది. చెమ్మ లేకుంటే అప్పుడు కూడా అది తమలపాకే అవుతుంది కానీ తాంబూలానికి పంకి రాదు. నాకు ఇక్కడ ఒక జానపదుల సామెత గుర్తుకొస్తూవుంది. అది ఏమిటంటే 'ఇహము పరము లేని మొగుడు ఇంటినిండా-రుచిపచి లేని కూర చట్టి నిండా.' నాలాంటివారి కవితలకు ఈ సామెత సరిగా సరిపోతుందేమో! ఒక రవివర్మ చిత్తరువు మనవద్ద వుంటే దానిని పదిలంగా ఒక చట్రము లో బింగించితే ఆ చిత్రమునకే కాక దానిని తగిలించిన గోడకు గోడ కలిగిన ఇంటికి కూడా అందమొస్తుంది. ఇది నిజమా కాదా అన్నది ఒక్కసారి మనము మనసుపెట్టి యోచించితే మనకే అవగతమౌతుంది.ఇంకొక ముఖ్యమైన విషయము తన 'మాళవికాగ్నిమిత్రము' అన్న నాటకములో ఈ మాట చెబుతాడు :
'పురాణమిత్యేవ నసాదు సర్వం నచాపికావ్యం నవమిత్య వాదం' దాని అర్థము 'పాత రోతా కాదు కొత్త చెత్త కాదు.' ఎంత గొప్ప మాటో చూడండి . పాత రచనలలో తలలోనికి దూరనివి కొత్త రచనలలో తలపులకే రానివి కోకొల్లలు. వీనిని 'అజగళస్థనము లంటారు.' మేక గొంతుక్రింద చన్నులనుండి పాలు రావు కదా. అంటే వుండీ వుపయోగములేనివి అని అర్థము.

వాల్మీకి కవి వ్యాసుడు కవి కాళీదాసు కవి అంతకు మించిన విశేషణముల నేవీ వారు తగిలించుకోలేదు.మరి నేడో 'సరస కవి' 'విప్లవకవి' 'భావకవి' 'ప్రేమ కవి' 'దిగంబర కవి' ఇవికాక అనేకానేకములైన బిరుదములు. అసలు
'కవి యను నామంబు నీరుకాకికి లేదే' అని ఒక కవి కుండను బద్దలు కొట్టినాడు. వాల్మీకి మహర్షిని వారి తరువాతి
కవులు ఎన్నివిధములుగా పొగిడినారో గమనించండి.

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరూహ్య కవితా శాఖం వందే వాల్మీకి కొకిలం

రామాయణ కల్పవృక్ష కవితా శాఖల పై వాల్మీకి అన్న కోకిల కూర్చొని 'రామ' రామ' యని కూయు చున్నది .

వాల్మీకి ముని సింహస్య కవితా వన చారిణా
శ్రుణ్వన్ రామ కథా నాదం కొనయాతి పరాం గతిం

కవన వనములో వాల్మీకి ముని సింహము 'రామ' 'రామ' యని గర్జించుతూ వుంటే విన్నవారు కైవల్యమును గాంచక ఎట్లుండగలరు.

యాపిబన్ రామ చరితామృత సాగరం
ఆరుతస్తం మునిం వందే ప్రాచేతాస మకల్మషం

రామ చరితామృత సాగరాన్ని సంతృప్తి అన్న మాటను ఆపేక్షించక ఆసాంతము త్రాగుచుండే మహనీయుడు కల్మషము అన్న పుట్టలోనుండి నిష్కల్మషుడైన వ్యక్తీ ప్రాచేతసుడు. ప్రచేతసుడంటే వరుణుడు. వరుణుని దయా వర్షముచే పునీతుడైనాడు కావున ఆయన ప్రాచేతసుడైనాడు.

వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని
పునాతు భువనం పుణ్యా రామాయణ మహానది

వాల్మీకి యన్న పర్వతము పై జనియించి రామ సాగరము లో చేరు ఈ నదీ ప్రవాహము తాను ప్రవహించే ప్రాంతము నంతా పుణ్యభూమిని చేయుచున్నది.
ఒక మహనీయుని గొప్పతనమును ఎన్నివిధముల పొగడవచ్చునో గమనించండి. ఇందులో ఎవరి స్వార్థము స్వలాభాములు లేవు.
ఇక వేదవ్యాసులవారు. తాను వ్రాసిన మహా భారతమునుగూర్చి ఒకే ఒక్క ముక్కతో దాని గొప్పదనాన్ని మనకు తెలియ జేసినాడు. 'యది హస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్కచిత్' ఇందులో వుండేది వేరే ఏభాషలోని
ఏ గ్రంథముము లోనైనా వుండవచ్చునుగానీ ఇందులోలేనిది ఎక్కడా వుండదు. ఇంచుమించు 125 ప్రముఖ పాత్రలు కలిగి అనేకానేకములైన ఆఖ్యాన ఉపాఖ్యానములు కలిగిన ఈ ఇతిహాసకావ్యము హోమర్ వ్రాసినట్లు చెప్పబడే ఈలియాడ్, ఒడెస్సిల కన్నా నిడివి లో 10 రెట్లు పెద్దదని తెలియు చున్నది.ఇది సాధారణమానవులకు సాధ్యమా!
వేదాలు విభజించి పురాణాలు ప్రచురించిన విష్ణ్వంశ సంభూతుడు.

ఇక కాళీ దాసును గూర్చి యొక్క మాట :

పురాకవిత్వా గణనప్రసంగే అధిష్టికాదిష్టిత కాళిదాసా
అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్థవతీ బభూవ

కాళిదాసు మొదలు పురాతన కవులలో పేరెన్నిక గన్న వారిని చిటికెన వ్రేలితో ఎన్న ప్రారంభించగా తరువాత ఎంచుటకు ఎవరూ దొరకలేదు. అందుకే ఆ వ్రేలికి 'అనామిక' మనే పేరు సార్థకమైనది. మరి ఇది నిజమే కదా!
ఇది నిజమైతే వారి పేరు మసకబారకుండా ఉంచవలసిన బాధ్యత మనపైన లేదా!

అసలింకొక చిన్న విషయము. పండిత ప్రపంచములో నాచన సోమనాథుని తిక్కనకు పోల్చదగినవాడని చెబుతూ వుంటారు.ఆయన వ్రాసిన ఉత్తర హరివంశములోని 'నరకాసుర వధ' ఘట్టములోని అనేక పద్యముల భావము పోకడ 'పోతన' వంటి గొప్ప కవియే పూర్తిగా అనుకరించినాడు లేక అనుసరించినాడు. ఆయన గొప్పదనము పాఠకులకు తెలియజేయ ఈ క్రింది పద్యమును భావ సహితముగా ప్రకటించున్నాను:

ఇది శ్రీ కృష్ణుడు శివుని స్థుతించే పద్యము. ఇక్కడ శివుడు పారిజాత'వృక్షము' తో పోల్పబడినాడు.

కుజము కుంజరముచే కూలునో కూలదో
కూలు,కుంజరమునీ కుజము గూల్చె
మాను పేరేటిచే మడుగునో మడుగదో
మడుగు,పేరేటినీ మాను మడచె
గాలునో యొకనిచే గాలదో సాలంబు
గాలు, నీ సాలంబు గాల్చే నొకని
దునియునో పరశు చే దునియదో వృక్షంబు
తునియు, నీ వృక్షంబు తునిమె బరశు

ననుచు దమలోన చర్చించు నమరవరుల
కభిమతార్థ పదార్థమై యందవచ్చు
పారిజాతమ్ము నా మ్రోల పండియుండ
నందగంటిని కోర్కుల నందగంటి

పద్యము చదివినవెంతనే కవి హృదయము మనకు బోధ పడదు. వాక్య నిర్మాణము లోనూ భావ ప్రకటనలోనూ అంటే చెప్పేతీరు లోనూ వైవిధ్యమే ఇందుకు కారణం . దీనిని పండితులు 'వక్రత' లేక 'వక్రగతి'అంటారని విన్నాను. చెట్టును ఏనుగు కూల్చుతుంది కానీ ఇక్కడ చెట్టు (పారిజాత వృక్షము తో పోల్పబ్డిన శివుడు) ఏనుగును, గజాసురుని, కూల్చింది.చెట్టు పెద్ద ఏరు వల్ల వంగిపోతుంది . ఇక్కడచెట్టు, శివుని శరీరము, గంగను వంచింది. చెట్టును ఎవరైనా కాల్చితే కాలి పోతుంది . ఇక్కడ చెట్టు, కాల్చేవానినే అంటే మన్మధునే కాల్చివేసింది.చెట్టు గోడ్డలిచే నరక బడుతుంది. ఇక్కడ చెట్టు, అంటే శివుడు గొడ్డలినే (దక్షయజ్ఞము లో శివుడు విష్ణువు యొక్క పరుశువును ద్రుంచుతాడు)ద్రుంచుతాడు.అటువంటి, దేవతలకిష్టమౌ పారిజాత వృక్షాన్ని అందుకొని తన కోర్కెను తీర్చుకొంటున్నాడు కృష్ణుడు. సోమనాథుని వేదసాస్త్రపురాణేతిహాస ప్రతిభ ,కవితాచమత్కృతి, వక్రగతిన పద్యము చెప్పిన తీరు గమనించండి. నాడు కవిత్వమంత నిర్దుష్టంగా వుండేది.

ఒకమాట ఆధునిక కవితానర్ఘ రత్నాలను గూర్చి కాస్త చెప్పుకొందాము. ఇందు పద్య సాంప్రదాయమును గూర్చి నేను వ్రాయబోవుట లేదు. గడియారం, విశ్వనాథ,రాయప్రోలు, జాషువ,కరుణశ్రీ ఇలా వ్రాస్తూ పొతే చాలా పెద్ద పట్టిక తయారౌతుంది.నేను ఇందు మాత్రా ఛందస్సు నుపయోగించి సనాతనత్వమును విడువని రెండు కవితలు, అదునాతనము తో కూడి మాత్రా ఛందస్సు తో రమ్యముగా వ్రాసిన ఒక కవితా శకలము, 1971లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఒక ఆధునిక కవిత ఉటంకించుచున్నాను.

మొదటిది పుట్టపర్తి నారాయణాచార్లు వారు వ్రాసిన 'శివ తాండవము' లోనిది.
తమ్ములై,ఘటితమోదమ్ములై,సుకృత రూ
పమ్ములై,శాస్త్ర భాగ్యమ్ములై,నవకోర
కమ్ములై ,వికచ పుష్పమ్ములై ,తుమ్మెదల,
తమ్ములై,భావ మంద్రమ్ములై,హావపు
ల్లమ్ములై,నూత్న రత్నమ్ములై,వెల్గు హా
సమ్ములై, కన్గొనల సోమ్ములై,విశ్రాంతి
దమ్ములై, రక్త కిసలమ్ములై,రక్తి చి
హ్నమ్ములైన్తంద్ర గమనమ్ములై,గెడగూడి
కులుకు నీలపు గండ్ల తళుకు జూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జలు మ్రోయ
ఆదేనమ్మా శివుడు పాదేనమ్మా భవుడు
ఇందులో మనకు ఒకవేళ ప్రతి పదమూ అర్థము కాకున్నా ఆ పద సౌందర్యము మనలను ఆసాంతము చదివించుటేగాక శివతాండవము కనులకు కనిపింపజేస్తుంది.

రెండవది వెంకట పార్వతీశ్వర కవులు వ్రాసిన 'ఏకాంత సేవ' లోనిది :

పుష్పనికుంజ ప్రభూత హాసంబు
సౌరభాపూర్ణ ప్రసన్న హాసంబు
మందాకినీ మృదు మధుర హాసంబు
రాకానిశాకర రమ్య హాసంబు
తారకాకోరక తరళ హాసంబు
విద్యుల్లతా ప్రభా విమల హాసంబు
మద్ర మోహన మూర్తి మందహాసమున
అద్భుతంముగా లీనమైనట్టులుండ...

చూడండి ఎన్ని విధములైన హాసమ్ములో! చదువుతూ వుంటే మనసుకు ఎంత హాయో !

ఇక మూడవది శ్రీ శ్రీ గారి 'మహా ప్రస్థానం' లోని 'జ్వాలా తోరణము' లోనిది:

జాతి జాతి నిర్ఘాత పాత సం
ఘాత హేతువై , కాలకేతువై
అదె సంవర్తపు తుఫాను మేఘం
తొలి గర్జించిన తూర్య విరావం

ప్రదీప్త కీలా ప్రవాళ మాలా
ప్రపంచవేలా ప్రసారములలో
మిహిర వాజితతి ముఖవ ధనుర్ద్యుతి
పుడమికి నేడే పుట్టిన రోజట

ఆ కవిత సాగిన తీరు చూడండి. మరి ఇందులో కఠిన పదములు లేవా! అట్లని చదువ నారంభించితే వదలబుద్ధవుతుందా! అది శ్రీశ్రీ గారి గొప్పదనము, చలం గారు శ్రీశ్రీ గారిని గూర్చి ఒకమాట చెప్పినారు. "కృష్ణ శాస్త్రి తన బాధ లోకానికి పంచితే, శ్రీ శ్రీ లోకంలోని బాధనంతా తాను తీసుకొంటాడు." ఎంతటి గోప్పమాటో చూడండి.

ఇక దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు వ్రాసిన 'అమృతం కురిసిన రాత్రి'నుండి 'మన సంస్కృతి' యన్న ఒక ఖండికలోని కొన్ని పాదములు:

మాధుర్యం,సౌందర్యం,కవితా
మాధ్వీక చషకంలోరంగరించి పంచిపెట్టిన
ప్రాచేతాస కాళిదాస కవిసంరాట్టులనీ,
వ్యూహా వ్యుహోత్కర భేద నచణ
ఉపనిషదర్థ మహోదధి నిహిత మహిత రత్న రాసుల్నీ
పోగొట్టుకొనే బుద్ధి హీనుడెవరు?

ఇందులో కఠిన పదాలు లేవా? భావము ఎంత గంభీరమైనదో చూడండి.వారిది సాధారణమైన కవిత కాదు. 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవితా సంకలనం. వారి కవితలు వారి మాటల్లోనే"నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు." వారు అంతటి గొప్పవారు కాబట్టే అభ్యుదయ కవిత్వాన్ని కూడా అద్భుత రీతిలో అందంగా ఆకర్షణీయంగా చెప్పవచ్చునని ఢంకా
బజాయించి చెప్పినారు.

ఈ నాలుగు కవితలూ పరిశీలించితే కవిత్వానికి భాషాప్రాముఖ్యత ఎంత అవసరమో అర్థమగుట లేదా!కవితా వస్తు ఏదైనా కావచ్చు. భావ స్పష్టత, భాషాధిష్టత ఎంత అవసరమో మనకు అవగతమౌతుంది. అందానికి అంతోఇంతో ఎంతోకొంత అలంకారమూ అవసరమే. అవసరము మీరితే అసహ్యమే మరి.

కావున పై విషయాలను మనసు పెట్టి చదివి కవితా సేద్యము ఆరంభించుతాము. ఇంకొక అతి ముఖ్యమైన విషయమేమిటంటే వీరెవరు 'ప్రేమ,విరహ,నిర్వేద' కవితలతో ప్రశస్థిపొందలేదు. చివరిగా శ్రీశ్రీ గారు కరుణశ్రీ గారితో ఏమన్నారో మీకు వినిపించి విరమించుతాను.

'వాగ్దానం' అన్న సినిమా లో ' సీతా కళ్యాణ సత్కథ' అన్న'హరి కథ' శ్రీశ్రీ గారు వ్రాసినారు. అందులో 'ఫెళ్ళు మనెవిల్లు ఘంటలు ఘల్లుమనియె' అన్న పద్యము తో ఆ హరికథ ముగుస్తుంది.అది కరుణశ్రీ గారు వ్రాసినది. ఒకసారి శ్రీశ్రీ కరుణశ్రీ గార్లు ఒకే వేదిక నలంకరించడం జరిగింది. అప్పుడు కరుణశ్రీ గారు " ఏమోయ్ నాపద్యము కాపీ చేసినావు నీ హరికథలో "అన్నారట.అది ఇంకా నీదెందుకౌతుంది. 'ప్రతి' బయటికొచ్చిన తరువాత వ్రాసిన వానిగా దానిపై నీకెంత హక్కో పాతకునిగా నాకూ అంతే హక్కన్నారట. అంటే మంచి కవితకు ఎంతటి విలువ వుంటుందో మనము గమనించ వలెను.

తత్సత్

సేకరణ ఇచ్చట నుండి...

Sunday, February 9, 2014

భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత


భీష్మ ఏకాదశి - శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి

శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.
భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్చంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని భాదలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు ?
ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పారేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్దం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.
బీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్దం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను భోదించాడు.
శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.
భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు కలదు.

ఇచ్చట నుండి సేకరించడమైనది